వికారాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ హయాంలో స్వచ్ఛ గ్రామ పంచాయతీలుగా రూపుదిద్దుకున్న పల్లెల్లో పాలన పడకేసింది. పల్లెప్రగతి కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొచ్చి దేశంలో ఎక్కడాలేని విధంగా పచ్చని పల్లెలుగా తీర్చిదిద్ది అవార్డులను సొంతం చేసుకున్న గ్రామ పంచాయతీల్లో గత ఐదారు నెలలుగా పాలన అస్తవ్యస్తమైనది. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పంచాయతీలకు ఒక్క రూపా యి కూడా విదల్చకపోవడంతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోతున్నా యి. పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించలేని దుస్థితి నెలకొన్నది.
ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేస్తూ కాలం వెల్లదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యలపై ఇప్పటివరకు ప్రస్తావించకపోవడం గమనార్హం. కేసీఆర్ హయాంలో జీపీలు దేశంలోనే ఆదర్శం కాగా.. ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో వాటి పరిస్థితి అధ్వానంగా మారింది. జిల్లాలోని చిన్న గ్రామ పంచాయతీల్లో వాటి పరిస్థితి మరి దారుణంగా మారింది. ఆ జీపీల్లో పనిచేస్తున్న కార్మికులకు గత 6 నెలలుగా జీతాలు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అదేవిధంగా గ్రామాల్లో పారిశుధ్యం దారుణంగా తయారైంది. డబ్బుల్లేక డ్రైనేజీ పైపులైన్ల లీకేజీలకు మరమ్మతులు జరుగడంలేదు. అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామానికీ ఇచ్చిన ట్రాక్టర్లు ప్రస్తుతం మూలనపడ్డాయి. ట్రాక్టర్లకు ఈఎంఐలు చెల్లించలేని పరిస్థితితోపాటు ట్రాక్టర్లను నడిపేందు కు డీజిల్ను కొనేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో ట్రాక్టర్ల నిర్వహణ భారంగా మారింది. ట్రాక్టర్లు మూలనపడడంతో ప్రతిరోజూ ఇంటిం టి నుంచి సేకరించే తడి-పొడి చెత్త ప్రక్రియ కూడా నిలిచిపోయింది. దీంతో గ్రామాల్లో ఎక్కడా చూసిన చెత్తాచెదారం దర్శనమిస్తున్నది. కొన్ని గ్రామ పంచాయతీల్లో నిధుల సమస్యతో కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని దుస్థితి నెలకొన్నది.
పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపుతున్నది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పైసా కూడా విదల్చలేదు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేక ప్రత్యేక అధికారులు ఇబ్బందిపడుతున్నారు. మౌలిక వసతులు సరిగ్గాలేక ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. వేతనాలు అందక చిన్న ఉద్యోగులు అలమటిస్తున్నారు.
– కందనెల్లి వెంకటేశ్, ఎన్కేపల్లి, యాలాల
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలైనా రూపాయి కూడా కేటాయించకపోవడంతో గ్రామాల్లో పాలన పడకేసింది. మౌలిక వసతులు కల్పించేందుకు నిధుల్లేక అధికారు లు ఇబ్బందిపడుతున్నారు. పంచాయతీ కార్మికులు, సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొన్నది. దీంతో వారు బయట అప్పులు తెచ్చుకుని బతుకు బండిని లాగిస్తున్నారు. ఇకనైనా రేవంత్రెడ్డి ప్రభుత్వం పంచాయతీలకు వెంటనే నిధులు కేటాయించి ఆదుకోవాలి.
– వడ్డె వెంకట్రాములు, మోత్కూర్, దోమ
కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవడంతో వాటి అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. నిధుల్లేక ప్రజలకు మౌలిక వసతులు సమకూరడం లేదు. మంచినీటిని సరఫరా చేసే బోరు మోటర్లు కాలిపోతే మరమ్మతులు చేయించేందుకు అధికారులు గ్రామ పెద్దలను బతిమిలాడే పరిస్థితి వచ్చింది. అత్యవసర పనులకు అధికారులు అప్పులు చేయాల్సి వస్తున్నది.
– కృష్ణ, మంతట్టి గ్రామం బషీరాబాద్
గత నాలుగైదు నెలలుగా గ్రామంలో చెత్త సేకరణ జరుగడం లేదు. అధికారులను సంప్రదిస్తే పంచాయతీలో నిధుల్లేవు రాగానే పనులను ప్రారంభిస్తామని చెబుతు న్నారు. దీంతో గ్రామంలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి పరిశుభ్రత లోపిస్తు న్నది. వీధిలైట్ల కోసం ప్రత్యేకాధికారిని కలిస్తే సరిపడా కాకుండా ఒకటి, రెండు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. లైట్లను ఏర్పాటు చేసుకునేందుకు గ్రామస్తులం సొంతంగా డబ్బు వెచ్చించాల్సి వస్తున్నది.
-శ్రీధర్రెడ్డి, బషీరాబాద్
నిధుల్లేక గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడుతున్నది. తాగునీటి కోసం మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగు కాల్వల మ్యాన్హోల్ మూతలు పగిలి ప్రమాదకరంగా మారాయి. రాత్రివేళల్లో వీధిలైట్లు వెలుగక ప్రజలు అవస్థలు పడుతున్నారు. పారిశుధ్య సిబ్బందికి వేతనాలు చెల్లించలేని దుస్థితి. ఒకవైపు పాలకవర్గాలు లేక, ఇంకోవైపు నిధులు లేక పంచాయతీలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి.