BJP | ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేయడంలో బీజేపీని మించిన పార్టీ లేదు. అందుకే ఆ పార్టీకి వాట్సాప్ యూనివర్సిటీ అనే ట్యాగ్లైన్ కూడా జతయింది. దేశంలో జరుగుతున్న ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఇదే తంత్రాన్ని ఉపయోగిస్తున్నది. ‘అబ్కీ బార్ చార్సౌకీ పార్’ అనే నినాదంతో ఎన్నికల సమరంలోకి దిగిన బీజేపీ అబద్ధాలు, దుష్ప్రచారాలనే నమ్ముకుంటూ ప్రజలను, ముఖ్యంగా రైతులను మోసం చేస్తున్నది. పదేండ్ల పాటు అధికారంలో ఉన్న ఆ పార్టీ కర్షకులపై అదనపు భారం మోపిందే తప్ప ఎటువంటి మేలు చేయలేదనేది జగమెరిగిన సత్యం.
వాస్తవాలను దాస్తూ, తప్పుడు ప్రచారాల ద్వారా అన్నదాతలను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి కార్పొరేట్ మీడియా సహకరిస్తుండటం ఆందోళనకరం. ఈ పరిస్థితుల్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల గురించి బీజేపీ చేస్తున్న ప్రచారం, అసలు వాస్తవాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
రైతుల ఆదాయం రెట్టింపు చేశామని బీజేపీ అంటున్నది. అంతేకాదు, కనీస మద్దతు ధరలు పెంచామని, ఫసల్ బీమా యోజనతో రైతులకు మేలు జరిగిందని, కిసాన్ సమ్మాన్ యోజనతో కర్షకులకు ప్రయోజనం చేకూరిందని బీజేపీ ప్రచారం చేస్తున్నది. కానీ, వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. వ్యవసాయ కుటుంబాలకు సాగు ద్వారా లభించే నెలవారీ ఆదాయం 2011-12లో రూ.2,855గా ఉండగా.. 2018-19 నాటికి రూ.2,816కు పడిపోయింది.
మోదీ ప్రభుత్వ హయాంలో కనీస మద్దతు ధరలు నత్తనడకన పెరిగాయి. 2003-04 నుంచి 2012-13 మధ్యకాలంలో ప్రధాన ఆహార పంటల మద్దతు ధరలు ఏడాదికి సగటున 8-9 శాతం వరకు పెరగగా.. 2013-14 నుంచి 2022-23 వరకు చూసుకుంటే 5 శాతమే పెరిగాయి. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తానని మోదీ హామీ ఇచ్చారు. అంటే సీ2 ఉత్పత్తి వ్యయం కంటే 50 శాతం అధికంగా మద్దతు ధరను నిర్ణయించాలి.
సీ2 ఉత్పత్తి ఖర్చు అంటే ఉత్పత్తి వ్యయం, కుటుంబ శ్రమకు సంబంధించిన విలువ, యాజమాన్య మూలధనం విలువపై వడ్డీ, భూమి అద్దె, సొంత భూమి ఉంటే కౌలు విలువ. కానీ, మోదీ ప్రభుత్వం మాత్రం ఏ2 జీఎఫ్ఎల్ (డబ్బు చెల్లించి కొనే అన్ని ఉపకరణాలు, సేవలు, జీ కుటుంబసభ్యుల శ్రమ విలువ) ఉత్పత్తి వ్యయంపై మద్దతు ధర నిర్ణయిస్తుంది. ఈ విధానంలో మూలధన ఆస్తుల విలువపై వడ్డీ, సొంత భూమికి కౌలు విలువను మినహాయించారు. ఇటువంటి తప్పుడు విధానాల కారణంగా క్వింటాలుకు దాదాపు రూ.500-600 వరకు రైతులు నష్టపోతున్నారు.
మోదీ హయాంలో వ్యవసాయం సంక్షోభంలోకి కూరుకుపోయిందనడానికి నిదర్శనమే పెరిగిన రైతు ఆత్మహత్యలు. 1997-2022 మధ్యకాలంలో 3.50 లక్షల మందికిపైగా రైతులు ఆత్యహత్య చేసుకోగా 2014-2022 మధ్యకాలంలో 1,00,474 మంది బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. మోదీ సర్కార్ రెండోసారి అధికారం చేపట్టాక ఆత్మహత్యలు మరింతగా పెరిగాయి. 2019లో (10,281), 2020లో (10,677), 2021లో (10,881), 2022లో (11,290) ఇలా ఏటికేడు బలవన్మరణాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించడంలోనూ మోదీ ప్రభుత్వం విఫలమైంది.
కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) అనేది ఓ విఫల పథకం. బీహార్, పశ్చిమబెంగాల్, ఏపీ, గుజరాత్, జార్ఖండ్ లాంటి అనేక రాష్ర్టాలు ఈ పథకం నుంచి వైదొలిగి సొంతంగా పంటల బీమా పథకాలను రూపొందించుకున్నాయి. ఈ పథకం కింద 2016-17లో 570.8 లక్షల హెక్టార్ల భూమికి బీమా చేయగా.. 2022-23 నాటికి అది 487.4 లక్షల హెక్టార్లకు తగ్గిపోయింది. 2018లో రూ.29,337 కోట్లుగా ఉన్న క్లెయిములు.. 2022 నాటికి రూ.18,043 కోట్లకు పడిపోయాయి. ఈ పథకం కార్పొరేట్ బీమా కంపెనీల లాభాపేక్ష కోసమే తీసుకొచ్చినట్టయింది.
జాతీయస్థాయిలో రైతులకు రుణమాఫీ 2008లో అమలైంది. 2022 జూలైలో ఎస్బీఐ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం.. 2014 తర్వాత ప్రకటించిన రుణమాఫీ పథకాల్లో అర్హులైన లబ్ధిదారుల్లో 50 శాతం మందికే రుణమాఫీ జరిగింది. వాస్తవానికి రుణాలు చెల్లించడంలో రైతులు అత్యుత్తమ రికార్డును కలిగి ఉన్నారు. వ్యవసాయ వృద్ధిరేటు తక్కువగా ఉన్నప్పటికీ, సంక్షోభం అంచుల్లో వ్యవసాయ రంగం ఉన్నప్పటికీ.. పారిశ్రామిక రంగం కంటే వ్యవసాయ రంగంలో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్పీఏ) చాలా తక్కువగా (17.4 శాతం) ఉండటం గమనార్హం.
వ్యవసాయ కార్మికులను కేంద్రం నిండా ముంచింది. గ్రామీణ ప్రజల ఆదాయం పెరిగిందని, ఉపాధి హామీకి కేటాయింపులు పెరిగాయని మోదీ సర్కార్ ప్రచారం చేసుకుంటున్నది. కానీ, వాస్తవమేమంటే.. గ్రామీణ భారత్లో నిరుద్యోగ సమస్య మరింత ఎక్కువైంది. 2013-14 నుంచి 2018-19 వరకు వ్యవసాయ, వ్యవసాయేతర కార్మికుల వేతనాల్లో ఏటా 3 శాతం తగ్గుదల నమోదైంది. ఆర్బీఐ ప్రకారం.. బీజేపీ పాలిత రాష్ర్టాలైన గుజరాత్, మధప్రదేశ్, యూపీ కార్మికులు జాతీయ సగటు కన్నా చాలా తక్కువ రోజువారీ వేతనాలు పొందుతున్నారు. రోజువారీ వేతనం జాతీయ సగటు రూ.345.70 కాగా.. గుజరాత్లోని వ్యవసాయ కార్మికులు రూ.241.90 మాత్రమే పొందుతున్నారు. మధ్యప్రదేశ్లో అత్యల్పంగా దినసరి వేతనం రూ.221.90గా ఉన్నది.
ఉపాధిహామీ పథకానికి ఏటా నిధులను తగ్గిస్తున్న బీజేపీ సర్కార్ ఆ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నది. 2013-14 బడ్జెట్లో 1.98 శాతం నిధులను ఈ పథకానికి కేటాయించగా.. 2023-24 నాటికి ఆ మొత్తం 1.33 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం. ఓ నివేదిక ప్రకారం.. గత 21 నెలల్లో దేశవ్యాప్తంగా 7.6 కోట్ల జాబ్కార్డులను తొలగించారు. చట్టంలో వంద రోజుల పాటు పని కల్పించాలని హామీ ఉన్నప్పటికీ 2020-21లో తప్ప మిగిలిన అన్ని సంవత్సరాల్లోనూ సగటు పనిదినాలు 50కి మించలేదు. కార్మికులకు చెల్లించే సగటు వేతనాలు పెరగడం లేదు.
నేషనల్ శాంపిల్ సర్వే సంస్థ (ఎన్ఎస్ఎస్వో) నివేదిక ప్రకారం.. 2018-19లో 41 శాతం గ్రామీణ కుటుంబాలకు భూమి లేదు. అభివృద్ధి పేరిట కార్పొరేట్లకు వ్యవసాయ భూములను కట్టబెడుతుండటంతో కొద్దిపాటి సాగు భూమిని కూడా రైతులు కోల్పోతున్నారు. పరిహారం విషయంలోనూ రైతులకు అన్యాయం జరుగుతున్నది. రుణాలు, సామాజిక భద్రత తదితర అంశాల్లోనూ వ్యవసాయ కార్మికులు అన్యాయానికి గురవుతున్నారు. 2019లో ప్రారంభమైన ప్రధానమంత్రి శ్రమయోగి మన్-ధన్ పింఛన్ పథకం వల్ల కార్మికులకు ప్రయోజనం చేకూరడం లేదు.
వలస కార్మికుల తరపున సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో కేంద్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్ను ప్రారంభించే లక్ష్యంతో 2021లో శ్రమ పోర్టల్ను ప్రారంభించింది. కానీ, అందులో ఎలాంటి సామాజిక ప్రయోజనాలను ప్రకటించలేదు. కార్పొరేట్ మీడియా ఈ పోర్టల్కు పెద్దఎత్తున ప్రచారం కల్పించింది. కానీ, వాస్తవానికి ఈ పథకం నుంచి ఒక్క వ్యవసాయ కార్మికునికి కూడా ప్రయోజనం చేకూరలేదు. ఇలా.. ప్రతీ పథకంలో వాస్తవాలు ఒకలా ఉంటే బీజేపీ మాత్రం తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటూ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నది. దేశ ప్రజలు నిజాలను గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
(వ్యాసకర్త: మూడ్ శోభన్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి)
99497 25951