డిస్పూర్ : అసోంలోని హోజాయ్ జిల్లాలోని కొవిడ్ కేర్ సెంటర్లో జూనియర్ వైద్యుడిపై దాడికి పాల్పడిన కేసులో 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఓడాలి మోడల్ కొవిడ్ ఆసుపత్రిలో కరోనా రోగి మృతి చెందడంతో బంధువులు యువ వైద్యుడిపై దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ మేరకు 24 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ట్వీట్ చేశారు. దాడిని అనాగరిక చర్యగా అభివర్ణించిన ఆయన.. ఫ్రంట్లైన్ కార్మికులపై దాడులను సహించబోమని స్పష్టం చేశారు. ఘటనపై దర్యాప్తును వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అయితే, యువ డాక్టర్ కుమార్ సేనాపతి ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో విధుల్లోకి వెళ్లిన మొదటి ఈ దాడి ఘటన చోటు చేసుకుందని అసోం శాసన సభ డెప్యూటీ స్పీకర్ డాక్టర్ నుమల్ మోమిన్ తెలిపారు. వైద్యుడిపై దాడి ఘటనను ఐఎంఏ ఖండించింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.