IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్లో మరో ఆల్రౌండర్ అరంగేట్రం చేయనున్నాడు. అఫ్గనిస్థాన్ యువకెరటం గుల్బదిన్ నయూబ్(Gulbadin Naib) త్వరలోనే ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్టుతో కలువనున్నాడు. స్టార్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ (Mitchell Marsh) టోర్నీకి దూరమవ్వడంతో గుల్బదిన్తో ఢిల్లీ ఒప్పందం చేసుకుంది.
ఈ యంగ్స్టర్ను జట్టులోకి ఆహ్వానిస్తూ శుక్రవారం ఢిల్లీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. రూ.50 లక్షల కనీస ధరకు గుల్బదిన్ను కొన్నట్టు సమాచారం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న రిషభ్ పంత్ సేనకు గుల్బదిన్ బలమవుతాడా? లేదా ? చూడాలి.
Can’t wait to see these celebrations in #IPL2024, @GbNaib 🔥 pic.twitter.com/4vlhueMYmE
— Delhi Capitals (@DelhiCapitals) April 26, 2024
ఐపీఎల్ మధ్యలో మార్ష్ తొడ కండరాల గాయంతో బాధపడ్డాడు. దాంతో, అతడు మెరుగైన చికిత్స కోసం స్వదేశానికి వెళ్లాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్కు చెందిన వైద్యబృదం పర్యవేక్షణలో మార్ష్ ఉన్నాడు. ఇక ఢిల్లీ కొత్త కెరటం గుల్బదిన్ అఫ్గన్ తరఫున 82 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. కాబూలీ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ ఆల్రౌండర్గా ఇప్పుడు ఐపీఎల్లో తన ముద్ర వేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
ఇప్పటికే పలు జట్ల తరఫున అఫ్గన్ ఆటగాళ్లు మెరుస్తున్నారు. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)లో అత్యధికంగా ముగ్గురు ప్లేయర్లు ఉన్నారు. రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఓమర్జాయ్, నూర్ అహ్మద్లు అదరగొడుతుండగా.. లక్నో సూపర్ జెయింట్స్ టీమ్లో నవీన్ ఉల్ హక్ మెరుస్తున్నాడు.