PM Modi | హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): దేశంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ర్టాల్లో ఎన్డీయే కూటమే విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ ఇప్పటికే ఓటమిని అంగీకరించిందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. ఎన్డీయే కూటమి తరుఫున ప్రధాని మోదీ రాజమండ్రిలోని వేమగిరిలో భారీ బహిరంగసభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. మే 13న ఏపీ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలవుతుందని చెప్పారు. వైసీపీ పాలనలో ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శించారు. ఐదేళ్లలో ఏపీలో ఇసుక మాఫియా, లికర్ మాఫియా నడుస్తుందని ఆరోపించారు. వైసీపీకి ఆర్థిక క్రమశిక్షణ లేదన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామన్న వైసీపీ.. ఐదేళ్లలో ఒక రాజధాని కూడా ఏర్పాటు చేయలేదని తప్పుబట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీ అభివృద్ధి అనే పట్టాలపై పరిగెత్తిందన్న మోదీ.. వైసీపీ హయాంలో ఏపీలో అభివృద్ధి పట్టాలు తప్పిందని విమర్శించారు.