KTR | సిరిసిల్ల టౌన్/రాజన్న సిరిసిల్ల/ హైదరాబాద్ సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ): అదానీ, అంబానీలకు నరేంద్రమోదీ రూ.14.50 లక్షల కోట్లు రుణమాఫీ చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇది తప్పని రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఎంపీ బండిసంజయ్కు సవాల్ విసిరారు. సోమవారం కరీంనగర్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్కు మద్దతుగా సిరిసిల్ల నియోజకవర్గంలో,చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్కు మద్దతుగా శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగుల్లో కేటీఆర్ ప్రసంగించారు.
‘అదానీ, అంబానీలకు మోదీ రుణమాఫీ చేయలేదని నిరూపిస్తే సిరిసిల్ల తెలంగాణ విగ్రహం వద్ద నా రాజీనామా పత్రం పెట్టి, ఎమ్మెల్యే పదవి ముఖానకొట్టి బయటకు వెళ్లిపోతా’ అని స్పష్టం చేశారు. ముడిచమురు ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేదని, జాతీయ రహదారులపై టోల్ ట్యాక్స్లు పెట్టి రూ.30 లక్షల కోట్ల పేదల రక్తం పీల్చారని విమర్శించారు. కాకులను కొట్టి గద్దలకు ఇచ్చినట్టు పెద్దలకిచ్చినోడు నరేంద్రమోదీ అని మండిపడ్డారు. గుజరాత్కు వరదలొస్తే రూ.వెయ్యి కోట్లు ఇచ్చిన మోదీ.. హైదరాబాద్కు పైసా కూడా ఇవ్వలేదని, మనపై సవతిప్రేమ చూపిస్తున్న మోదీ రాజధర్మం ఇదేనా? అని నిలదీశారు. నిరుద్యోగం, ధరలపై మాట్లాడే ముఖం లేక.. దేవుడి పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.
‘ఈ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్తో లేదు. ఆ పార్టీ చేసిన మోసం అందరికీ అర్థమైంది. రైతులు కూడా రగిలిపోతున్నారు. ఇక బీజేపీ చేస్తున్న మోసాలను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నది’ అని కేటీఆర్ అన్నారు. నమో అంటే నరేంద్రమోదీ కాదని, నమ్మించి మోసం చేయడమేనని, రాముడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎంపీగా గెలిచి ఐదేండ్లవుతున్నా బండి సంజయ్ను చూశారా? అని అడిగితే లేదంటూ ప్రజలు సమాధానం చెప్పారు.
కేసీఆర్ ప్రభుత్వం పోయాక రాష్ట్రంలో అన్నమో రామచంద్రా! అన్న పరిస్థితి వచ్చిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మోచేతికి బెల్లం పెట్టి మోసపూరిత హామీలతో కాంగ్రెస్ గెలిచింది. ఆరు గ్యారెంటీల్లో ఒక్కటే అమలుచేసి రేవంత్రెడ్డి మొగోళ్లకు, ఆడోళ్లకు తాకులాటలు పెట్టిండు. వంద రోజుల్లో రైతు రుణమాఫీ, రూ.4 వేల పింఛన్లు వచ్చాయా? ఓటు వేసుకునేటపుడు ఒక లెక్క.. గెలిచినంక ఒకతీరులా ప్రభుత్వ పాలన ఉన్నది’ అని కాంగ్రెస్ సర్కారుపై ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా 250 మంది రైతులు, 50 మంది ఆటోడ్రైవర్లు, నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని దుయ్యబట్టారు.
ఉచితబస్సు ప్రయాణం తప్ప, తులం బంగారం, స్కూటీలు, రూ.2 లక్షల రుణమాఫీ ఇవ్వలేదని కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగారు. 420 హామీలిచ్చి 5 గ్యారెంటీలు కూడా అమలు చేయలేదని గుర్తుచేశారు. సిరిసిల్లకు వచ్చిన రేవంత్రెడ్డి నేతన్నలు, రైతులకు వరాలు ఇస్తారనుకుంటే.. తనను, కేసీఆర్ను తిట్టడానికే సమయం వెచ్చించారని మండిపడ్డారు. మోసపోయి గోసపడుతున్నామని, కేసీఆర్ పాలనే బాగుందని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. భవిష్యత్ మనదేనని కార్యకర్తలకు భరోసానిచ్చారు. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన కొంతమంది విమర్శలు చేస్తున్నారని, తమ ప్రభుత్వం వచ్చాక మిత్తితో సహా రుణం తీర్చుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ను కేంద్రపాలితప్రాంతం చేస్తామని, సిరిసిల్ల జిల్లాను రద్దు చేస్తామంటున్న వారికి బుద్ధి చెప్పాలని కోరారు.
పదేండ్ల బీఆర్ఎస్.. నిజం, పదేండ్ల బీజేపీ.. విషం, 150 రోజుల కాంగ్రెస్.. మోసం.
– కేటీఆర్
తెలంగాణను ఓ ఆర్ఎస్ఎస్ వ్యక్తి నడుపుతున్నారని సీఎం రేవంత్పై కేటీఆర్ విమర్శలు సంధించారు. ‘సీఎం రేవంత్రెడ్డి రాహుల్గాంధీ లైన్లో లేడు. మోదీ లైన్లో ఉన్నాడు’ అని కేటీఆర్ విమర్శించారు. కొత్త కంపెనీలను తీసుకొచ్చే ముఖం లేదని, కాంగ్రెస్ సర్కార్ అసమర్థత వల్ల గుజరాత్, చెన్నైకి కంపెనీలు తరలిపోతున్నాయని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 16 సీట్లు ఇచ్చిన హైదరాబాద్కు రుణపడి ఉంటానని, ఈ ఎన్నికల్లో 10-12 సీట్లను బీఆర్ఎస్కు అప్పగిస్తే ఆరు నెలల్లో రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసిస్తారని అన్నారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, ప్రకాశ్గౌడ్, సబితాఇంద్రారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు కార్తీక్రెడ్డి, స్వామిగౌడ్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్తు చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిషత్తు మాజీ చైర్పర్సన్ తుల ఉమ, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, బీఆర్ఎస్ రాజన్నసిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల పట్టణాధ్యాక్షుడు జిందం చక్రపాణీ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, గజభీంకార్ రాజన్న, బొంపెల్లి సురేందర్రావు, కల్వకుంట్ల గోపాల్రావు, జనగామ శరత్రావు తదితరులు పాల్గొన్నారు.