హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): డిగ్రీలు, ప్రతిభ, ఎదగాలన్న బలమైన ఆకాంక్ష ఉన్నప్పటికీ నైపుణ్యాలు ఉంటేనే యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. శనివారం టీ-వర్క్స్లో నిర్వహించిన ఫ్యూచర్ స్కిల్స్ సమ్మిట్ అవార్డ్స్-2026 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టెక్నాలజీ, పరిశ్రమలు మారినా.. నేర్చుకోవాలన్న తపన కొత్త ఆర్థిక వ్యవస్థలో తప్పనిసరి అని చెప్పారు. కృత్రిమ మేధస్సు (ఏఐ)తో ఉద్యోగాలు మారుతాయని, అదే సమయంలో కొత్త వృత్తులు, పరిశ్రమలు, అవకాశాలు భారీగా వస్తాయని వివరించారు. ఏఐ, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, క్వాంటమ్ టెక్నాలజీలు భవిష్యత్తు సాంకేతిక విప్లవానికి కీలకంగా మారనున్నట్టు తెలిపారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగంలో సుమారు 20వేల ఉద్యోగావకాశాలున్నాయని మంత్రి తెలిపారు. ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న 10 వేల మంది విద్యార్థులకు పరిశ్రమల సహకారంతో శిక్షణ ఇస్తున్నట్టు వెల్లడించారు. శిక్షణతోపాటు ఉపాధికి అనుసంధానించడమే లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫ్యూచర్ స్కిల్స్ సమ్మిట్ నిర్వాహకులు రమణ, క్రిష్, టీ-వర్క్స్ సీఈవో జోగిందర్ తణికెళ్ల, టాస్క్ సీఈవో నితిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.