Om Birla | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon session)పదే వాయిదా పడుతూ ఉండటంపై లోక్ సభ (Lok Sabha) స్పీకర్ ఓం బిర్లా (Om Birla) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార, విపక్ష సభ్యులు సభా కార్యకలాపాలకు తరచూ అంతరాయం కలిగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు సభా గౌరవానికి అనుగుణంగా ప్రవర్తించే వరకూ తాను సభలో అడుగు పెట్టబోనని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సభాధ్యక్ష స్థానంలో కనిపించలేదు.
జులై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి సభలో మణిపూర్ (Manipur) అంశంపై గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. మణిపూర్ అల్లర్లు, అమానుష ఘటనలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని విపక్ష నేతలు పట్టుబడుతున్నారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ కారణాలతోనే స్పీకర్ అసంతృప్తిగా ఉన్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఓం బిర్లా నిర్ణయంతో బుధవారం లోక్ సభ కార్యకలాపాలను బీజేపీ ఎంపీ కిరీట్ సోలంకి (Kirit Solanki) నిర్వహించారు. నేడు కూడా సభలో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మణిపూర్ అంశానికితోడు ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుకు వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. సభ్యులు శాంతియుతంగా వ్యవహరించాలని కిరీట్ కోరినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆయన సభను వాయిదా వేశారు.
ఇదిలా ఉండగా.. ప్రతిపక్షాలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Pm Modi)పై లోక్ సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. ఈనెల 8 న చర్చ ప్రారంభమవుతుంది. మూడు రోజులపాటు ఈ చర్చ సాగుతుంది. చివరి రోజు అంటే 10వ తేదీన మోదీ సమాధానం చెబుతారు.
Also Read..
Manipur | రాష్ట్రపతిని కలిసిన ఇండియా కూటమి నేతలు.. మణిపూర్ అంశంపై జోక్యం చేసుకోవాలంటూ విజ్ఞప్తి
Cheetah | మరో చీతా మృతి.. ఐదు నెలల్లో తొమ్మిదో మరణం