Cheetah | ప్రాజెక్ట్ చీతా (Project Cheetah)లో భాగంగా దక్షిణాఫ్రికా, నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మధ్యప్రదేశ్ లోని కూనో జాతీయ పార్కు (Kuno National Park) లో తాజాగా మరో చీతా మరణించింది. బుధవారం ఉదయం ధాత్రి (Dhatri) అనే ఆడ చీతా (female cheetah) మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. చీతా మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘కూనో పార్కులోని ఓ ఆడ చీతా ధాత్రి ఈ ఉదయం మరణించింది. చీతా మరణానికి గల కారణాలు పోస్టుమార్టం తర్వాత తెలుస్తాయి’ అని పార్క్ అధికారులు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. కాగా, ఐదు నెలల్లో ఇది తొమ్మిదో ఘటన కావడం గమనార్హం.
దేశంలో అంతరించిపోయిన చీతాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గదేడాది సెప్టెంబర్లో 8 చీతాలు ఆఫ్రికాలోని నమీబియా (Namibia) నుంచి మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కుకు తీసుకొచ్చారు. రెండో దశలో ఈ ఏడాది ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా (South Africa) నుంచి మొత్తం 12 చీతాలను కునో నేషనల్ పార్క్కు తరలించారు.
అయితే, ఆ 20 చీతాల్లో ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు తొమ్మిది (తాజా మరణంతో కలిపి) చీతాలు మరణించాయి. మార్చి 27వ తేదీన సాషా అనే ఆడ చీతా మూత్రపిండ వ్యాధితో ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత నెల తిరగకుండానే ఏప్రిల్ 23న కార్డియో-పల్మనరీ ఫెయిల్యూర్తో ఉదయ్ అనే చీతా మరణించింది. ఆ తర్వాత 20 రోజులకే మే 9న దక్ష అనే ఆడ చీత మృతి చెందింది. అదే నెలలో మూడు కూన పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయాయి. ఆ తర్వాత జులై 11వ తేదీన తేజస్ అనే మగ చీతా గాయాల కారణంగా మరణించింది. జులై 14వ తేదీన సూరజ్ ప్రాణాలు కోల్పోయింది. తాజాగా ధాత్రి మృతి చెందింది.
Also Read..
Viral News | డోక్సూరి తుపాను విధ్వంసం.. వరద నీటిలోనే వివాహం
Shehbaz Sharif | అన్ని సమస్యల పరిష్కారానికి భారత్ తో చర్చకు సిద్ధం : పాక్ ప్రధాని
Manipur Violence | మణిపూర్ అల్లర్లు.. మూడు నెలల్లో 30 మంది అదృశ్యం..!