హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జైళ్లశాఖపై నిఘా కరువైంది. చాలామంది అధికారులు ఉన్నతాధికారుల కండ్లుగప్పి సొంత ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని దాదాపు 20 మంది ఖైదీలు పెరోల్ గడువు ముగిసినప్పటికీ బయట యథేచ్ఛగా తిరుగుతున్నారు. అయినా అధికారులకు చీమకుట్టినట్టు కూడా లేదని జైళ్లశాఖ డీజీ దృష్టికి వచ్చింది. దీంతో ఆయన అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకోవడంతోపాటు సోమవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. అధికారుల అలసత్వం, జైళ్లలోని భద్రతా లోపాలపై డీజీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పెరోల్ ముగిసిన ఖైదీలను ఎందుకు అదుపులోకి తీసుకోవడం లేదని, వారిని జైళ్లకు తరలించకుండా ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారో చెప్పాలని నిలదీసినట్టు సమాచారం.
‘రాంగ్ రిలీజ్’లు జైళ్లకు మచ్చతెచ్చేలా ఉన్నాయని తీవ్రంగా స్పందించినట్టు వినికిడి. 2024 డిసెంబర్లో తప్పుడు పత్రాలు సమర్పించి జైలు నుంచి విడుదలైన ఫయాజ్ గురించి ఈ భేటీలో తీవ్ర చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. పరకాల, చర్లప్లలిలో ఖైదీలు పరారవడం జైళ్లలో భద్రతను ప్రశ్నిస్తున్నాయని డీజీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనికి బాధ్యులైన ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేసినప్పటికీ మిగతా సిబ్బందిలో మార్పు రావడం లేదని, ఇకనుంచి ఎలాంటి పొరపాట్లు జరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్టు తెలిసింది. జైళ్లలో భద్రతా ఏర్పాట్లపై వచ్చే నెలలో మరోసారి సమీక్ష నిర్వహిస్తానని, ఆ లోగా తప్పిదాలన్నీ సరిదిద్దుకోవడంతోపాటు పెరోల్ ముగిసిన వారందరినీ తిరిగి జైళ్లకు తరలించాలని ఆదేశించినట్టు వినికిడి. ఇక నుంచి జైళ్లలో ఏ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించినా అప్పటికప్పుడే కఠిన చర్యలు చేపడుతానని డీజీ హెచ్చరించినట్టు విశ్వసనీయ సమాచారం.