Manipur Violence | అల్లర్లు, హింసాత్మక ఘటనలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur Violence) అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలలకు పైనే ఆ రాష్ట్రంలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో హింసాత్మక ఆందోళనల్లో చోటు చేసుకున్న ఘోరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఉదంతం ఇటీవలే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా, రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నప్పటి నుంచి.. ఇప్పటి వరకు దాదాపు 30 మంది కనిపించకుండా (30 Go Missing) పోయినట్లు తాజాగా వెల్లడైంది. మూడు నెలల కాలంలోనే వీరంతా అదృశ్యమైనట్లు తేలింది.
పాత్రికేయుడు, సామాజిక కార్యకర్త అయిన 47 ఏళ్ల సమరేంద్ర సింగ్.. రాష్ట్రంలో మే 6వ తేదీన ప్రారంభమైన భారీ హింసాకాండ తర్వాత కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అతని ఆచూకీ లభించలేదని కుటుంబ సభ్యులు వాపోయారు. అతనితోపాటు ఉన్న స్నేహితుడు 48 ఏళ్ల యమ్ ఖైబామ్ కిరణ్ కుమార్ కూడా కనిపించట్లేదు. వీరిద్దరూ కాంగ్ పోక్పి జిల్లా సరిహద్దులో ఉన్న మణిపూర్ ఒలింపిక్ పార్క్ కు ఆనుకుని ఉన్న సాహెబంగ్ ప్రాంతానికి వెళ్లినట్లు గుర్తించారు. అయితే, ఆ తర్వాత నుంచి వారి జాడ తెలియరాలేదు. వారి ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ వస్తున్నాయి.
హింసాకాండ నెలకొన్న తర్వాత జులై 6వ తేదీన రాష్ట్రంలో ఆంక్షలు సడలించారు. దీంతో 17 ఏళ్ల హిజామ్ లువాంగ్బీ నీట్ కోచింగ్ నిమిత్తం ఇంటి నుంచి వెళ్లింది. కోచింగ్ తర్వాత తన స్నేహితుడితో కలిసి బైక్ పై వేరే ప్రాంతానికి వెళ్లిన యువతి సాయంత్రమైనా ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఇక అప్పటి నుంచి వారి జాడ కనిపించకుండా పోయింది. వారి ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ అయ్యాయి. వారు ఇంఫాల్ కు సమీపంలోని నంబోల్ వైపు వెళ్లినట్లు సీసీటీవీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఇలా ఒకరిద్దరు కాదు, మూడు నెలల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లిన దాదాపు 30 మంది కనిపించకుండా పోవడం ఇప్పుడు మిస్టరీగా మారింది.
మరోవైపు అదృశ్య ఘటనలపై చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఫిర్యాదులు అందిన వెంటనే వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని.. కానీ, కనిపించకుండా పోయిన వారి జాడ మాత్రం దొరకడం లేదని తెలిపారు. ప్రస్తుతం తప్పిపోయిన వారి సంఖ్య 30గా ఉన్నప్పటికీ ఇది మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. అల్లర్ల తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రంలో వివిధ కారణాలతో 6 వేలకు పైగా ఎఫ్ ఐఆర్ లు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read..
Shehbaz Sharif | అన్ని సమస్యల పరిష్కారానికి భారత్ తో చర్చకు సిద్ధం : పాక్ ప్రధాని
Art Director | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ మృతి
Parliament | విపక్షాల నిరసనతో మధ్యాహ్నానికి వాయిదాపడ్డ లోక్ సభ