మహబూబ్ నగర్ : కరోనాను ఎదుర్కొనేందుకు జిల్లాలో మందులు ,ఆక్సిజన్, వ్యాక్సిన్ తో సహా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ప్రైవేటు దవాఖానలో కరోనా వార్డును పరిశీలించారు. ముందుగా అత్యవసర సేవల విభాగగాన్ని సందర్శించారు. అనంతరం కరోనా వార్డును సందర్శించి ఎంత మంది రోగులు ఉన్నారో.. వారికి చికిత్స ఎలా అందిస్తున్నారో ఆరా తీశారు.
అందుబాటులో ఉన్న ఆక్సిజన్, మందులు తదితర వివరాలను క్యాజువాలిటీ ఎమర్జెన్సీ మెడికల్ అధికారి ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఫార్మసీలోని రేమిడిసివర్, డాక్సీ, ఇతర కరోనా మందులను పరిశీలించారు. కరోనాను ఎదుర్కొనేందుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రభుత్వ దవాఖానతో పాటు, ఎస్వీఎస్ హాస్పిటల్ లో కూడా ప్రభుత్వం తరఫున 100 పడకల కొవిడ్ వార్డు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.
కరోనా పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రజలు ముందు జాగ్రత్త చర్యగా ఉంటే కట్టడి చేయవచ్చు అని తెలిపారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
జిల్లాలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదని, అవసరమైన అన్ని పరీక్షలు చేసేందుకు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు, ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా సేవలు అందుబాటులో ఉన్నాయని వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. హైదరాబాద్కు దీటుగా జిల్లాలో ఏర్పాట్లు ఉన్నాయని, ఎవరు హైదరాబాద్ వెళ్లాల్సిన పని లేదన్నారు.
మంత్రి వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కృష్ణ, ఎస్.వి.ఎస్ వైద్య కళాశాల పీఆర్ఓ కిరణ్ తదితరులు ఉన్నారు
ఇవి కూడా చదవండి..
గ్రేటర్ వరంగల్లో ఎన్నారైల ఇంటింటి ప్రచారం
కరోనాతో పూల వ్యాపారి మృతి..అంత్యక్రియలు అడ్డుకున్న గ్రామస్తులు