బెంగళూరు: పిల్లలు స్కూల్ ఎగ్గొట్టడంతో తల్లిదండ్రులు మందలించారు. ఈ నేపథ్యంలో అక్కా, తమ్ముడు ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఫ్రీ బస్సులో కిలో మీటర్ల దూరం ప్రయాణించారు. పేరెంట్స్ ఫిర్యాదుతో చివరకు వారి ఆచూకీని పోలీసులు గుర్తించారు. (Kids Run Away From Home) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. మరతహళ్లి ప్రాంతంలో నివసించే అక్కాతమ్ముడైన 13 ఏళ్ల బాలిక, 9 ఏళ్ల బాలుడు ఫిబ్రవరి 1న స్కూల్కు వెళ్లలేదు. ఇది తెలుసుకుని తల్లిదండ్రులు వారిని మందలించారు. ఈ నేపథ్యంలో ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అక్కాతమ్ముడు కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయారు.
కాగా, 13 ఏళ్ల బాలిక తన ఆధార్ కార్డు వెంట తీసుకెళ్లింది. దీంతో కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆమె వినియోగించుకున్నది. తమ్ముడైన 9 ఏళ్ల బాలుడు టికెట్ లేకుండా అక్కతో కలిసి ప్రయాణించాడు. శివమొగ్గ, చిత్రదుర్గ సహా పలు ప్రాంతాల్లో వారు తిరిగారు. సుమారు 200 కిలోమీటర్ల వరకు బస్సులో ప్రయాణించారు.
మరోవైపు పిల్లలు కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లను అలెర్ట్ చేశారు. పిల్లల ఫోటోలు, మిస్సింగ్ వివరాలను సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. చివరకు వారిద్దరూ చిత్రదుర్గలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడి నుంచి బెంగళూరుకు ఆ పిల్లలను తరలించారు. తల్లిదండ్రులకు వారిని సురక్షితంగా అప్పగించారు.
Also Read: