Udhayanidhi Stalin : నటి త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో అరెస్టైన తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ మంగళవారం సాయంత్రం విడుదలయ్యారు. మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో సెంగిపట్టి పోలీసులు ఉదయనిధిని విడుదల చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఎదుట భారీగా అభిమానులు, కార్యకర్తలు గుమిగూడారు. త్రిషపై వ్యాఖ్యల నేపథ్యంలో మంగళవారం ఉదయం ఉదయనిధిని తన నివాసమైన నీలాంకారై నుంచి పోలీసులు అరెస్టు చేశారు. ఆయన తంజావూరులో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అక్కడికే తీసుకెళ్లారు. దీంతో ఉదయనిధి తరఫున ఆయన లాయర్లు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
వెంటనే ఆయనను విడుదల చేయాలని ఆదేశాలివ్వాల్సిందిగా కోర్టును కోరారు. దీనిపై ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. తాము ఉదయనిధిని అరెస్టు చేసినప్పటికీ, పోలీస్ కస్టడీకి కోరడం లేదని తెలిపింది. కేవలం ప్రశ్నించడానికే ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. దీంతో ప్రశ్నించడం పూర్తైన తర్వాత ఆయనను విడుదల చేయాలని ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనికి అనుగుణంగా పోలీసులు ఉదయనిధిని దాదాపు గంటన్నర పాటు సెంగిపట్టి పోలీసులు ప్రశ్నించారు. విచారణ అనంతరం సాయంత్రం ఆయనను విడుదల చేశారు. ఉదయనిధి విచారణ జరుగుతున్నంతసేపు పోలీస్ స్టేషన్ వద్ద ఆయన పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో గుమిగూడారు. విచారణ అనంతరం బయటకు విడుదలైన ఉదయనిధి.. వారికి అభివాదం చేస్తూ వెళ్లిపోయారు.
సోమవారం తంజావూరులో డీఎంకే ఆధ్వర్యంలో ఒక ర్యాలీ, సభ జరిగింది. కావేరి జలాల విషయంలో చెలరేగిన వివాదంపై ఈ సభ జరిగింది. ఈ సందర్భంగా నటి త్రిషపై ఉదయనిధి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై పోలీస్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తమిళనాడులోని విజయ్ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. ఈ అరెస్టుపై తమిళనాడు మాజీ సీఎం, ఉదయనిధి స్టాలిన్ తండ్రి ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అహంకారం వినాశనానికి దారి తీస్తుందంటూ టీవీకేను, విజయ్ను, బీజేపీని హెచ్చరించారు. ఇక, విజయ్.. రీల్స్ సీఎం అని అభివర్ణించారు.