Russia attack : రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) దేశాల మధ్య కాల్పుల విరమణ కోసం ఒకవైపు మంతనాలు జరుగుతున్నాయి. అయినా ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగిస్తోంది. తాజాగా రష్యా సైన్యం ఉక్రెయిన్పై 300కు పైగా డ్రోన్లు, 30 క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో అనేక ఉక్రెయిన్లో అనేక నివాస భవనాలు, ఆస్పత్రులు, వాహనాలు ధ్వంసమైనట్లు తెలిసింది.
భవనాల శిథిలాల కింద అనేక మంది అమాయక ప్రజలు చిక్కుకున్నారని, వారిని బయటకు తెచ్చేందుకు భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని ఉక్రెయిన్ మీడియా తెలిపింది. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది. రష్యన్ దళాలు ఉక్రెయిన్లోని ఒడెసా నగరంపై 20కి పైగా డ్రోన్లు, పదుల సంఖ్యలో క్షిపణులు ప్రయోగించింది. దాంతో భారీ ఆస్తి నష్టం సంభవించింది. ఈశాన్య సుమీ ప్రాంతంలో కీలకమైన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.
అయితే ఈ యుద్ధం సమయంలో తమకు అండగా ఉంటూ ఆయుధాలను సరఫరా చేస్తున్న మిత్ర దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. రష్యాతో జరుగుతున్న యుద్ధాన్ని ఎదుర్కోవడానికి ఉక్రెయిన్కు ఆస్ట్రేలియా ఆయుధ సాయం చేస్తోంది. ఇందులోభాగంగా శనివారం కీవ్కు M1A1 అబ్రమ్స్ ట్యాంకులను అందజేసింది. ఇతర సామగ్రిని రాబోయే నెలల్లో పంపనున్నట్లు ఆస్ట్రేలియా రక్షణమంత్రి రిచర్డ్ మార్లెస్ పేర్కొన్నారు.
కీవ్పై మాస్కో చేస్తున్న చట్టవిరుద్ధమైన, అనైతిక దండయాత్రకు వ్యతిరేకంగా తాము ఈ సాయాన్ని అందిస్తున్నామని ఆస్ట్రేలియా రక్షణ మంత్రి తెలిపారు.