హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (CJ) జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ (Justice AK Singh) ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్భవన్లో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్లుగా ఇప్పటి వరకు ఆరుగురు పనిచేశారు. త్రిపుర హైకోర్టు నుంచి బదిలీపై వచ్చిన జస్టిస్ ఏకే సింగ్ ఏడో చీఫ్ జస్టిస్. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి హైకోర్టు న్యాయమూర్తులు, శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్, సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరయ్యారు. కాగా, హైకోర్టులో మొత్తం జడ్జీల సంఖ్య 42 కాగా ప్రస్తుతం 26 మంది పనిచేస్తున్నారు. ఇద్దరు జడ్జీల బదిలీ.. ఒకరి చేరికతో ఆ సంఖ్య 25కు తగ్గింది.
న్యాయకోవిదుల కుటుంబంలో మూడో తరానికి చెందిన జస్టిస్ ఏకే సింగ్ 1965 జూలై 7న డాక్టర్ రాంగోపాల్సింగ్, డాక్టర్ శ్రద్ధ సింగ్ దంపతులకు జన్మించారు. ఆయన తల్లివైపు కుటుంబానికి చెందిన తాత జస్టిస్ బీపీ సిన్హా సుప్రీంకోర్టు ఆరో ప్రధాన న్యాయమూర్తిగా, మరో తాత జస్టిస్ శంభుప్రసాద్ సింగ్ పట్నా హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టి్స్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ ఆనర్స్, న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందిన ఏకే సింగ్ 1990లో ఉమ్మడి పాట్నా హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 1990 నుంచి 2000 వరకు పాట్నా హైకోర్టులో, 2001 నుంచి 2012 వరకు జార్ఖండ్ హైకోర్టులో న్యాయవాదిగా పలు కీలక కేసులు వాదించారు. 2012లో జార్ఖండ్ హైకోర్టు అదనపు న్యాయయమూర్తిగా, 2014లో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2022లో జార్ఖండ్ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టి్స్గా సేవలు అందించారు. 2023లో త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. తాజాగా తెలంగాణ హైకోర్టు సీజేగా బదిలీపై వచ్చారు.