న్యూఢిల్లీ : ఇండియాస్ ప్రాజెక్ట్-75 పేరుతో హైటెక్ జలాంతర్గాములు నిర్మించేందుకు కేంద్రం సిద్ధమైంది. రూ.50 వేల కోట్ల ఖర్చతో 6 జలాంతర్గాములు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం మార్గం సుగమం చేసింది. ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ ఆక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) రెండు కంపెనీలను షార్ట్ లిస్ట్ చేసింది. మొదటి జలాంతర్గామి 8 సంవత్సరాల తర్వాత అందుబాటులో వస్తుందని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
డీఏసీ షార్ట్ లిస్ట్ చేసిన రెండు కంపెనీలు.. మజాగాన్ డాక్స్ (ఎండీఎల్), లార్సెన్ అండ్ టర్బో (ఎల్ అండ్ టీ). ఈ రెండు కూడా భారత్కు చెందిన కంపెనీలే. వీటి నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) లేదా టెండర్ను డీఏసీ అంగీకరించింది. ఈ సంస్థలకు డీజిల్ ఎలక్ట్రిక్ ప్రోగ్రాం అప్పగించనున్నారు. దీనికి ప్రాజెక్ట్ -75 ఇండియా లేదా పీ -75 ఐ అని పేరు పెట్టారు. మేక్ ఇన్ ఇండియా కింద ప్రాజెక్ట్ -75 ప్రారంభించబడింది. ప్రాజెక్ట్ -75 కింద నిర్మించబోయే జలాంతర్గామి పరిమాణం మన వద్ద ఉన్న స్కార్పీన్ జలాంతర్గామి కంటే రెండు రెట్లు పెద్దదిగా ఉంటుంది. ఈ జలాంతర్గాములలో యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణులను, ల్యాండ్ అటాక్ క్రూయిజ్ క్షిపణులను ఏర్పాటు చేయాలని భారత నావికాదళం ఆశిస్తున్నది.
చైనా నావికాదళం హిందూ మహాసముద్రంలో నిరంతరం చొరబడుతున్నది. నీటి అడుగున సామర్ధ్యం పరంగా భారత నావికాదళం తన సామర్థ్యాలను పెంచడం అవసరం అయ్యింది. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద నావికాదళాన్ని కలిగి ఉంది. చైనా వద్ద 350 యుద్ధనౌకలు ఉండగా.. వీటిలో 50 కన్వెన్షనల్, 10 న్యూక్లియార్ జలాంతర్గాములు ఉన్నాయి. 2030 నాటికి ఈ యుద్ధనౌకల సంఖ్యను 420 కి పెంచాలని చైనా భావిస్తున్నది.
పాకిస్తాన్లో యువాన్ తరగతికి చెందిన 8 డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గాములు ఉన్నాయి. 054-A రకానికి చెందిన 4 యుద్ధనౌకలు ఉన్నాయి. ఇవి కాకుండా చైనాతో 7 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నది. దీని కింద పాక్కు మరిన్ని ఆయుధాలు, నావికా వేదికలు లభించనున్నాయి.
150 యుద్ధనౌకలతో కూడిన భారతదేశం నౌకాదళంలో 12 డీజిల్-ఎలక్ట్రిక్ జలాంతర్గాములు ఉన్నాయి. ఇవి చాలా పాతవి. వీటిలో సగం మాత్రమే పనిచేసే సామర్ధ్యం కలిగి ఉన్నాయి. మన వద్ద రెండు న్యూక్లియార్ జలాంతర్గాములు.. ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ చక్ర ఉన్నాయి. వీటిని రష్యా నుంచి లీజుకు తీసుకున్నారు.
కరోనా టైం: సప్లిమెంట్స్ నకిలీలను ఇలా కనిపెట్టండి..!
పోస్ట్-కొవిడ్ ఫిట్నెస్ : నిత్యం 10 కి.మీ పరిగెత్తుతున్న మిలింద్ సోమన్
ముమ్మాటికీ బెట్టింగే : లూడోను లక్కీ గేమ్గా ప్రకటించాలని పిటిషన్
లాక్డౌన్ ఎఫెక్ట్ : పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం
కింగ్ కోబ్రా : శివాలిక్ కొండల్లో దర్శనం
ఐఐటీయన్ల ప్రతిభ : అందుబాటులోకి హై ఫ్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్
చైనా చరిత్రలో మరిచిపోలేని మరక.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..