MP High Court : ఓ కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు (Madhyapradesh High Court) సంచలన తీర్పు వెలువరించింది. భార్య (Wife) తో ‘అసహజ శృంగారం’ జరిపారన్న ఆరోపణలపై భర్త (Husband) మీద ఐపీసీ సెక్షన్ 377 (IPC Section 377) కింద కేసు నమోదు చేయడం చెల్లదని స్పష్టం చేసింది. ఈ మేరకు గ్వాలియర్ ధర్మాసనం (Gwaliar bench) కీలక తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్లోని భిండ్ జిల్లాకు చెందిన ఓ మహిళ తన భర్తపై తీవ్ర ఆరోపణలు చేసింది.
తన భర్త తనపై అసహజ శృంగారానికి పాల్పడ్డాడని, వరకట్నం కోసం వేధించాడని, దాడిచేసి బెదిరించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు ఆమె భర్తపై సెక్షన్ 377 (అసహజ నేరాలు), 498A (వరకట్న వేధింపులు), 323 (దాడి), 506 (బెదిరింపులు) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును రద్దు చేయాలని కోరుతూ భర్త హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ మిలింద్ రమేష్ ఫడ్కే, సెక్షన్ 377 కింద నమోదైన కేసును కొట్టివేశారు.
వివాహిత దంపతుల మధ్య జరిగే లైంగిక చర్యలను ఈ సెక్షన్ కింద నేరంగా పరిగణించలేమని ధర్మాసనం అభిప్రాయపడింది. వైవాహిక బంధంలో భర్త తన భార్యతో చేసే లైంగిక చర్య అత్యాచారం కాదని సెక్షన్ 375 లో ఉన్న మినహాయింపును కోర్టు ప్రస్తావించింది. అందువల్ల భార్యాభర్తల మధ్య జరిగే అసహజ సంభోగాన్ని కూడా సెక్షన్ 377 కింద నేరంగా చూడలేమని స్పష్టంచేసింది. అయితే వరకట్న వేధింపులు, దాడి, బెదిరింపులకు సంబంధించిన ఇతర సెక్షన్ల కింద కేసులను కొట్టివేయడానికి కోర్టు నిరాకరించింది.
అసహజ శృంగార ఆరోపణ మినహా ఇతర ఆరోపణలపై విచారణ కొనసాగించాలని ఆదేశించింది. ఇటీవల గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో వైవాహిక వివాదాల్లో సెక్షన్ 377ను ఆయుధంగా వాడుతున్నారని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.