GST : వస్తు సేవల పన్ను (GST) విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు మరి కొన్ని గంటల్లో అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం చలామణిలో ఉన్న నాలుగు శ్లాబుల (5, 12, 18, 28) విధానంలో రెండింటిని (12, 28) కేంద్రం తొలగించిన విషయం తెలిసిందే. దీంతో 5, 18 శ్లాబులు (GST Slabs) మాత్రమే మిగిలాయి. అన్ని వస్తువులు, సేవలను ప్రభుత్వం ఈ రెండు శ్లాబుల్లోకే తీసుకొచ్చింది. విలాస వస్తువులపై 40 శాతం పన్ను విధించనున్నారు. జీఎస్టీ 2.0 పేరుతో తీసుకొచ్చిన ఈ సంస్కరణలు సోమవారం నుంచి (సెప్టెంబర్ 22) అమల్లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. కొత్త జీఎస్టీ శ్లాబుల దృష్ట్యా ప్రధాని ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
జీఎస్టీలో ప్రస్తుతం 5, 12, 18, 28 శాతం పన్ను స్లాబులున్నాయి. మార్కెట్లోని దాదాపు అన్ని వస్తూత్పత్తులపై ఈ స్లాబుల ప్రకారమే పరోక్ష పన్నులు పడుతున్నాయి. అయితే, 5, 18శాతం స్లాబ్లను మాత్రమే కొనసాగించాలని, 12, 28 స్లాబ్లను తొలగించాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.. ఆయా రాష్ర్టాల ఆర్థిక మంత్రులతో కూడిన కమిటీకి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ఆయా రాష్ట్రాల మంత్రులతో కూడిన బృందం తాజాగా ఆమోదం తెలిపింది. ఆల్ట్రా లగ్జరీ, సిన్ గూడ్స్ (సిగరెట్లు వంటివి)పై 40 శాతం పన్ను విధించడం కూడా కేంద్ర ప్రతిపాదనలో ఉందని యూపీ ఆర్థికమంత్రి సురేష్ కుమార్ ఖన్నా తెలిపారు. 12 శాతం స్లాబులోని 99 శాతం వస్తూత్పత్తులు 5 శాతంలోకి, 28 శాతం స్లాబులోని 90 శాతం వస్తూత్పత్తులు 18 శాతంలోకి రానున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం జీఎస్టీలో కనీస పన్ను 5 శాతం స్లాబులో రోజువారీ నిత్యావసర వస్తూత్పత్తులున్నాయి. ఇక స్టాండర్డ్ గూడ్స్పై 12 శాతం, ఎలక్ట్రానిక్స్, ఆయా రకాల సేవలపై 18 శాతం, పొగాకు, ఇతర విలాసవంతమైన ఐటమ్స్పై గరిష్ఠంగా 28 శాతం పన్నులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే అదనంగా పాన్ మసాలా, లగ్జరీ కార్లు తదితరాలపై జీఎస్టీ నష్టపరిహార సెస్సును కూడా విధిస్తున్నారు. జీఎస్టీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయానికి వాటిల్లుతున్న నష్టాలను భర్తీ చేయడానికే ఈ సెస్సు. అలాగే కొన్ని నిత్యావసరాలకు జీఎస్టీ మినహాయింపుండగా.. ప్రత్యేకంగా వజ్రాలు, సానబెట్టిన రత్నాలు, బంగారంపై 0.25 శాతం నుంచి 3 శాతం వరకు జీఎస్టీ విధిస్తున్నారు.
ప్రజలకు లాభమెంత?
ఇప్పుడున్న జీఎస్టీ స్లాబుల్లో 18 శాతం చాలా కీలకం. జీఎస్టీ వసూళ్లలో ఈ ఒక్క స్లాబు నుంచి వచ్చే ఆదాయం వాటానే 65 శాతంగా ఉన్నది. జీఎస్టీ 2.0లో ఈ స్లాబును యథాతథంగానే ఉంచుతుండటం గమనార్హం. అంటే ప్రస్తుతం ఈ స్లాబులో ఉన్న వస్తూత్పత్తుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు వస్తున్న ఆదాయానికి ఢోకా లేదన్నమాట. ఫలితంగా వాటి వినియోగదారులకు ఇకపైనా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఎంతకు కొంటున్నారో.. కొత్త జీఎస్టీ విధానంలోనూ వాటి కోసం అంతే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మోదీ సర్కారు గొప్పగా జనాలపై జీఎస్టీ భారాన్ని తగ్గించబోతున్నామని, దీపావళి కానుక అంటూ ఊదరగొడుతుండటం అంతా ఉత్తదే. మెజారిటీ వినియోగదారులకు జీఎస్టీ స్లాబుల తగ్గింపు వల్ల ఒనగూరుతున్నదేమీ లేదన్నది తేటతెల్లమైపోయింది. అలాగే ప్రస్తుతం పేద, మధ్య తరగతి వర్గాలు కొంటున్న 5 శాతం స్లాబులోని వస్తూత్పత్తులపై పన్ను భారం అలాగే ఉంటుంది.
ఇక పొగాకు, ఆన్లైన్ గేమింగ్స్, లగ్జరీ బైకులు, కార్లు ఇతర వస్తూత్పత్తులపై గరిష్ఠంగా 40 శాతం జీఎస్టీ ఉండనే ఉంటున్నది. దీంతో కొత్త జీఎస్టీ విధానం వచ్చి పన్ను స్లాబులు తగ్గినా మొత్తం పన్ను భారం మాత్రం ఇప్పుడున్నట్టుగానే ఆయా కొనుగోలుదారులపై 88 శాతంగానే ఉంటుందన్న అంచనాలున్నాయి. దీంతో 12 శాతం, 28 శాతం స్లాబులను తీసేయడం వల్ల నష్టపోతున్న ఆదాయం అంతంత మాత్రమేనని పలువురు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నిజానికి జీఎస్టీ వసూళ్లలో ఇప్పుడు 12 శాతం స్లాబు ద్వారా 5 శాతం, 28 శాతం స్లాబు ద్వారా 11 శాతం ఆదాయమే వస్తున్నది. ఏదిఏమైనా కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ స్లాబుల తగ్గింపు జిమ్మిక్కులకు ఈ లెక్కలన్నీ నిదర్శనం. అలాగే బంగారం, వజ్రాలు, ఇతర విలువైన రత్నాలపై జీఎస్టీ యథాతథంగానే ఉండనున్నది. దీంతో స్థూలంగా జీఎస్టీ స్లాబుల సవరణతో సగటు సాధారణ వినియోగదారునికి కేంద్రంలోని మోదీ సర్కారు చేకూర్చే లబ్ధి ఏమీ లేదని తేలిపోయింది.
ఇవికూడా చదవండి..
“పెన్నులు, బ్యాగులపై జీఎస్టీ మోత.. టెక్స్బుక్స్పై కూడా 18% బాదుడు”
“ఇక విమాన చార్జీలకు రెక్కలు.. ఈ నెల 22 నుంచి పెరగనున్న టికెట్ ధరలు”
“పరోక్ష పన్నుల ప్రత్యక్ష బాదుడు”
“నష్టపలహార సెస్సు.. రాష్ట్రాలను నిండా ముంచిన మోదీ సర్కారు”