రుద్రంపూర్, జూలై 29 : ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్న సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శాలెం రాజుకు బుధవారం పీవీకే-5 ఇంక్లైన్లో ఘనంగా వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీకే-5 ఇంక్లైన్ అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల ప్రతినిధులు జీఎం శాలెం రాజును శాలువాతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ.. శాలెం రాజు తన 37 సంవత్సరాల సుదీర్ఘ సేవా ప్రస్థానంలో బొగ్గు ఉత్పత్తి పెంపు, గని భద్రత, క్రమశిక్షణ, ఉద్యోగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ సంస్థ అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. యాజమాన్యం–కార్మికుల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలోనూ, సమస్యల పరిష్కారంలో సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రదర్శించారని ప్రశంసించారు.
అనంతరం పలువురు అధికారులు, కార్మిక సంఘాల నాయకులు ఆయన సేవలను స్మరించుకుంటూ, పదవీ విరమణ అనంతరం కూడా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో నిండి ఆనందమయ జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పీవీకే-5 ఇంక్లైన్ ఏజెంట్ రామ్ భరోస్ మెహతో, మేనేజర్ పి. రవికిరణ్, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎం.డి.రజాక్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్ రావు, గ్రూప్ ఇంజనీర్ గోదావరి శ్రీనివాసరావు, సేఫ్టీ ఆఫీసర్ అనిల్ సాగర్, వెల్ఫేర్ ఆఫీసర్ షకీల్, ఐఎన్టీయూసీ ఫిట్ సెక్రటరీ చిలక రాజయ్య, ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ భూక్యా రమేశ్, పిట్ ఇంజనీర్ శ్రీనివాస్తో పాటు ఇతర అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.