కోల్కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ఎన్నికల సమావేశాలు, సభలను రద్దు చేసుకున్నారు. కొవిడ్ విజృంభణ నేపథ్యంలో బంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై ఈసీ ఆంక్షలు విధించింది. పాదయాత్రలు, రోడ్ షోలపై నిషేధం విధించింది. అలాగే, బహిరంగ సభలకు 500 మందికి మాత్రమే అనుమతించాలని సూచించింది. బంగాల్లో ఇప్పటికే ఆరు విడతల ఎన్నికలు పూర్తికాగా.. మిగిలిన రెండు విడతల ఎన్నికలకు ఈ ఆంక్షలు వర్తించేలా ఈసీ ఆదేశాలు జారీచేసింది.
ఇప్పటికే రోడ్ షోలు, సైకిల్, బైక్, ఇతర వాహనాల ర్యాలీలకు అనుమతులు మంజూరు చేసి ఉంటే వాటిని ఉసంహరించుకోవాలని అధికారులను ఆదేశిస్తూ.. బెంగాల్ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్, రిటర్నింగ్ అధికారులకు నోటీసులు జారీచేసింది. ఈ క్రమంలో మమతా ఎన్నికల సమావేశాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు ట్వీట్ చేశారు. బెంగాల్లో నిన్న ఒకే రోజు 11వేలకుపైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి.