వికారాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ఎస్ఐఆర్(ఓటరు జాబి తా ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ఓటర్ల నుంచి ఫారాలను సేకరించడంలోనూ బీఎల్వోలు అలసత్వం వహిస్తున్నారు. కొంతమంది బీఎల్వోలు మినహా మెజార్టీ బూత్ లెవల్ అధికారులు ఆయా పోలింగ్ బూత్లలో ఏదో ఒక చోట కూర్చుంటున్నారు. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి వారి వద్దకు తీసుకొస్తేనే ఆన్లైన్లో ఎంట్రీ చేస్తున్నారు.
సర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో ఇప్పటికే వెనుకంజలో ఉన్న జిల్లా బీఎల్వోల నిర్లక్ష్యం, సూపర్వైజర్లు, ఏఆర్వోల పర్యవేక్షణ లేకపోవడంతో నెమ్మదిగా సాగుతున్నది. ఈనెల 24తో ఎన్యూమరేషన్ ఫారాలను భర్తీ చేసి, డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు గడువు ముగియనున్నది. కాగా, జిల్లాలో ఇప్పటివరకు కేవలం 16.37 శాతం మాత్రమే డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. అత్యల్పంగా తాండూరు నియోజకవర్గంలో 13.23 శాతం, వికారాబాద్ నియోజకవర్గంలో 14.87 శాతం, కొడంగల్ నియోజకవర్గంలో 16.87 శాతం, పరిగి నియోజకవర్గంలో 20.08% నమోదైంది.
బీఎల్వోల నిర్లక్ష్యం..
జిల్లాలో సర్ ప్రక్రియలో బీఎల్వోలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంటింటికెళ్లి ఓటర్ల నుంచి వివరాలను నింపిన ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించాల్సిన బీఎల్వోలు పోలింగ్ బూత్ల్లో ఏదో ఒక చోట కూర్చొని తమ వద్దకు ఎన్యూమరేషన్ ఫారాలను తీసుకొస్తేనే తీసుకుంటున్నారనే అభిప్రాయం ఓటర్ల నుంచి వ్యక్తమవుతున్నది. ఆయా పార్టీలకు చెందిన వారు మాత్రమే వారి వద్దకు వచ్చి పూర్తి చేసిన ఫారాలను అందజేస్తున్నా సాధారణ ఓటర్లు మాత్రం ఇంకా ఒక్క శాతం కూడా భర్తీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను అందజేయకపోవడం గమనార్హం.
ఓటర్లు ఎవరైనా ఇంటింటికెళ్లి భర్తీ చేసిన ఫారాలను సేకరించాలి కదా..? ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నిస్తే తమకు చిరునామాలు తెలియదని సమాధానమిస్తుండడం గమనార్హం. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని బీఎల్వోలు ఇంటింటికెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను సేకరిస్తేనే జిల్లాలో సర్ ప్రక్రియ సక్సెస్ కానున్నదని పలువురు పేర్కొంటున్నారు. మరోవైపు గడువు సమీపిస్తుండడంతో ఓటర్లలో టెన్షన్ నెలకొన్నది. ఎన్యూమరేషన్ ఫారాలను ఎలా భర్తీ చేయాలో తెలియక ఓటర్లు బీఎల్వోల కోసం ఎదురుచూస్తున్నారు. కొందరు బీఎల్వోలు ఇంటింటికెళ్లి ఆ ఫారాలను సేకరిస్తున్నా మెజార్టీ బీఎల్వోలు మాత్రం సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యంగా వహిస్తున్నారనే విమర్శలువెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో 98.43% పంపిణీ..
జిల్లాలో ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 98.43 శాతం పూర్తయ్యింది. జిల్లాలో 10,17,671 మంది ఓటర్లుండగా 10,01,240 మంది ఓటర్లకు ఫారాలను అందజేశారు. కొడంగల్ నియోజకవర్గంలో 2,51,255 మంది ఓటర్లుండగా 2,49,521(99.31 శాతం) మందికి.. పరిగి సెగ్మెంట్లో 2,76,260 మంది ఓటర్లుండగా, 2.69లక్షలు(97.54 శాతం) మందికి, వికారాబాద్ సెగ్మెంట్లో 2,37,921 మంది ఓటర్లలో 2,35,327 (98.91 శాతం) మందికి, తాండూరు సెగ్మెంట్లో 2,52,235 మంది ఓటర్లలో 2,47,392 (98.08 శాతం) మందికి సర్ ఫారాలను బీఎల్వోలు అందజేశారు. మరోవైపు 77.65 శాతమే ఓటర్ల మ్యా పింగ్ పూర్తయ్యింది. జిల్లాలో 10,17,671 మంది ఓటర్లుండగా, 7,85,495 మంది ఓటర్లకు సంబంధించి మ్యా పింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. పరిగి సెగ్మెంట్లో 84.08% పూర్తికాగా, 2,32,111 మందికి, వికారాబాద్ సెగ్మెంట్లో 79.98% పూర్తికాగా, 1,84,674 మందికి, తాండూరు సెగ్మెంట్లో 66.29% పూర్తికాగా, 1,65,637 మందికి, కొడంగల్ సెగ్మెంట్లో 79.78 శాతం పూర్తికాగా, 2,00,073 మంది ఓటర్లకు మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేశారు.