జనగామ, జూలై 10 (నమస్తే తెలంగాణ: ప్రభుత్వం నుంచి బకాయిలు అందక ఆర్థిక, మానసిక వేదనతో రిటైర్డ్ ఉద్యోగి మల్లయ్య ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత బాధాకరమని.. విశ్రాంత ఉపాధ్యాయుడి మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. జనగామ జిల్లా కేంద్రంలో ఇటీవల ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు పగిడిపల్లి మల్లయ్య కుటుంబాన్ని శుక్రవారం పల్లా రాజేశ్వర్రెడ్డి స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు.
ఉపాధ్యాయుడిగా దాదాపు 35 ఏండ్లు సేవలందించిన మల్లయ్యకు ఉద్యోగ విరమణ అనంతరం పీఎఫ్, జీపీఎఫ్, గ్రాట్యుటీతోపాటు ఇతర రిటైర్మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించక పో వడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని అన్నారు. బకాయిల కోసం పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా, కోర్టును ఆశ్రయించినా న్యాయం జరుగలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం అప్పుల గురించి మాట్లాడటం మానేసి, కాంట్రాక్టర్లకు చెల్లించే నిధులను ఒకరోజు నిలిపివేసినా విశ్రాంత ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ చెల్లించవచ్చని సూచించారు.