న్యూఢిల్లీ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వరుసగా మూడు ముఖ్యమైన సమీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు కొవిడ్ సంబంధిత ప్రధాని అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే ఉదయం 10 గంటలకు కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కొవిడ్ పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అనంతరం 11.30గంటలకు దేశీయ ప్రముఖ ఆక్సిజన్ తయారీదారులతో సమావేశం అవుతారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గురువారం సైతం ఆక్సిజన్ సంక్షోభంపై ప్రధాని సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
దేశంలో కొవిడ్ అత్యవస పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పశ్చిమ బెంగాల్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం కొవిడ్-19 పరిస్థితులను సమీక్షించేందుకు ఉన్నత స్థాయి సమావేశాలకు అధ్యక్షత వహించనున్న నేపథ్యంలో.. శుక్రవారం బెంగాల్కు వెళ్లడం లేదని తెలిపారు. సాయంత్రం 5 గంటలకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్లో ఎనిమిది విడుతలుగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆరు విడుతల పోలింగ్ పూర్తవగా.. ఈ నెలలో మరో రెండు స్థానాలకు పోలింగ్ జరుగనుంది. మే 2న ఫలితాలు విడుదలవనున్నాయి. అలాగే కేంద్రహోంమంత్రి అమిత్ షా, బీజేపీ ముఖ్య నేతలు తమ ప్రచారాన్ని కుదించారు.