హైదరాబాద్ : దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉత్తర-తూర్పు ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ నెల 26వ తేదీ వరకు వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
జోగులాంబ గద్వాల, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నల్గొండ, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వడగళ్లు కురుస్తాయని తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్, ములుగు, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని, 30-40 నుంచి కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది.
నిన్న రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ పట్టణంలో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగత్రలు 35.5 నుంచి 40.4 డిగ్రీల మధ్య నమోదైనట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది. గురువారం సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, మెదక్, నారాయణపేట, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది.