న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తున్నది. గత 15 రోజులుగా ప్రతిరోజూ మూడు వేలకుపైగా మరణాలు సంభవిస్తుండగా, తాజాగా ఆ సంఖ్య నాలుగు వేలు దాటింది. దీంతో అమెరికా, బ్రెజిల్ తర్వాత ఒక్క రోజులో నాలుగు వేలకుపైగా కరోనా మరణాలు నమోదవడం భారత్లోనే కావడం గమనార్హం. ఇప్పటివరకు ఒక్కరోజులో అత్యధికంగా జనవరి 12న అమెరికాలో 4490 మంది మృతిచెందారు. కాగా, దేశంలోవరుసగా మూడో రోజూ నాలుగు లక్షలకుపైగా మంది కరోనా బారినపడ్డారు.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 4,01,078 మంది కరోనా పాజిటివ్లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,18,92,676కు చేరింది. ఇందులో 1,79,30,960 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 37,23,446 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 2,38,270 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 4187 మంది మృతిచెందగా, కొత్తగా 3,18,609 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని వెల్లడించింది. ఇక 16,73,46,544 మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశామని తెలిపింది.
ఇక.. నిన్న కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్రలో 54,022, కర్ణాటకలో 48,781, కేరళలో 38,460 చొప్పున ఉన్నాయి. మరణాల్లో 898 మంది మరణించగా, కర్ణాటకలో 592 మంది, ఉత్తరప్రదేశ్లో 372 మంది బాధితులు మృతిచెందారు.
దేశంలో గత 82 రోజులుగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈఏడాది ఫిబ్రవరి 14న ప్రారంభమైన కరోనా రెండో వేవ్లో ఇప్పటివరకు 1,09,68,039 కేసులు రికార్డయ్యాయి. ఇందులో 82 వేల మంది కరోనాతో మరణించారు. కాగా దేశంలో కరోనా కేసులు గతేడాది జనవరి 30న ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 14 వరకు 1,09,16,481 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అంటే తొలి దశలో కోటి కేసులు నమోదవడానికి ఏడాది సమయం పడితే, రెండో దశలో కేవలం 82 రోజుల్లోనే కోటి 10 లక్షల కేసులు రికార్డయ్యాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి