రంగారెడ్డి : అబ్దుల్లాపూర్మెట్ వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టగా.. సీఐ దంపతులు ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మృతులను పోలీస్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్, ఆయన భార్య ఝాన్సీగా గుర్తించారు. లక్ష్మణ్ సుల్తాన్పూర్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రమాద సమయంలో ఝాన్సీ కారు నడిపినట్లుగా గుర్తించారు. దంపతులతో వారి కొడుకు ఎనిమిదేళ్ల కుశలవ్ ఉండగా.. వెనుక సీటులో కూర్చవడంతోనే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు. సూర్యాపేట నుంచి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని, బంధువులకు సమాచారం అందించినట్లు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కారు ముందు భాగం భారీగా దెబ్బతింది.