HYDRAA Ranganath : పదేపదే కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్న హైడ్రా(HYDRAA) కమిషనర్గా రంగనాథ్ (Ranganath)ను తొలగించాలని హైకోర్టు సంచలన ఆదేశాలు ఇవ్వడం రాష్ట్రవ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. హైడ్రా కమిషనర్గా రంగనాథ్ కొనసాగితే రూల్ ఆఫ్ లా అదుపు తప్పుతుందని.. ఆయనను వెంటనే తప్పించాలని చీఫ్ సెక్రటరీని అత్యున్నత ధర్మాసనం ఆదేశించడంపై రంగనాథ్ స్పందించారు. హైడ్రా కమిషనర్గా వందల ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడానని ఆయన పేర్కొన్నారు.
హైకోర్టు వ్యాఖ్యలపై స్పదించిన రంగనాథ్.. హైడ్రా కమిషనర్గా తాను వందల ఎకరాల ప్రభుత్వ భూములను ధైర్యంగా కాపాడానని రంగనాథ్ తెలిపారు. తన నేతృత్వంలో ఇప్పటివరకూ రూ.1.50లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కాపాడామని, ఆరు చెరువులను పునరుద్దరించామని ఆయన చెప్పారు. అయితే.. ల్యాండ్ మాఫియా, కబ్జాదారులు కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని రంగనాథ్ ఆరోపించారు.

తాజాగా వివాదానికి కేంద్రమైన లోతుకుంట భూమిని శాంతా శ్రీరామ్ అనే స్థిరాస్థి సంస్థ కొట్టేయాలని చూసిందని, ఆ భూమి విలువ సుమారు రూ.10 వేల కోట్లు ఉంటుందని రంగనాథ్ పేర్కొన్నారు. ఆ సంస్థ వాళ్లు అనుమతి లేకుండా హెరిటేజ్ గుట్టలను ధ్వంసం చేస్తున్నారని, పలు సంఖ్యలో చెట్లను నిర్ధాక్షిణ్యంగా నరికేశారని ఆయన తెలిపారు. సేవ్ ది రాక్స్, పర్యావరణ సొసైటీ ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగిందని పేర్కొన్న రంగనాథ్ తనపై ఉన్న 63 కోర్టు ధిక్కరణ కేసులు కబ్జాకోరులు వేసినవేనని స్పష్టం చేశారు. అంతేకాదు తనకు న్యాయస్థానాలు, చట్టాలపై పూర్తి గౌరవం, నమ్మకం ఉందని, తనను తొలగించాలని హైకోర్టు వెలువరించిన ఆదేశాలపై చట్టపరంగానే పోరాడుతానని రంగనాథ్ వెల్లడించారు.