Time Zone | ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఒకే సమయం ఉండదు. ఒక్కో దేశంలో ఒక్కో టైంజోన్ ఉంటుంది. భారత్లో ఇండియన్ స్టాండర్డ్ టైం ఉంది. దీని ప్రకారం భారత్లోని అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఒకే టైం ఉంటుంది. కానీ అక్కడ మాత్రం గడియారంలో సమయం ఒక గంట ముందుంటుంది.
ఎక్కడో కాదు.. అసోంలోని తేయాకు తోటల్లో! ఎందుకంటే.. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఈశాన్య ప్రాంతంలో సూర్యుడు తొందరగా ఉదయిస్తాడు. సాయంత్రం ఒక గంట ముందు అస్తమిస్తాడు. ఇదే విషయాన్ని గుర్తించిన బ్రిటీష్ పాలకులు తేయాకు ఉత్పత్తిని పెంచేందుకు పనిగంటలను ఒక గంట ముందుకు జరిపారు. అంతటా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తే.. తేయాకు తోటల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పనిచేస్తారు. ఈ విధానాన్ని టీ గార్డెన్ టైమ్ అని పిలుస్తుంటారు. బ్రిటీష్ పాలకులు తీసుకొచ్చిన ఈ సమయాన్నే ఇప్పటికీ అక్కడి తేయాకు తోటల్లో పాటిస్తున్నారు.
స్వాతంత్ర్యానికి ముందు మన దేశంలో బాంబే టైమ్, కలకత్తా టైమ్ అనే రెండు టైమ్ జోన్లు ఉండేవి. దీంతో తూర్పు, పశ్చిమ ప్రాంతాలు మెరుగ్గా సూర్యరశ్మిని ఉపయోగించుకునేవి. ఫలితంగా విద్యుత్ ఆదా అయ్యేది. అయితే ఆ తర్వాత భారత ప్రభుత్వం రెండు టైమ్ జోన్ల స్థానంలో ఇండియన్ స్టాండార్డ్ టైమ్ జోన్ (IST )ను తీసుకొచ్చింది. ఇప్పుడు అసోంలోని టీ గార్డెన్ టైం స్ఫూర్తితో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక టైం జోన్ కావాలని అక్కడి నేతలు డిమాండ్ చేస్తున్నారు.
“Summer Diet | సమ్మర్లో ఆరోగ్యంగా ఉండాలా? అయితే ఈ ఫుడ్ను మీ డైట్లో చేర్చుకోవడం మస్ట్ !”