అహ్మదాబాద్: దేశంలో రోజురోజుకు కరోనా కేసులు అధికమవుతున్నాయి. దీంతో వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి ప్రభుత్వాలు మరోసారి లాక్డౌన్, కర్ఫ్యూల బాటపడుతున్నాయి. తాజాగా గుజరాత్ ప్రభుత్వం రాష్ట్రంలోని 20 నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నగరాల్లో సాయంత్రం 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. ఇది నేటి నుంచి ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. ఇప్పటికే అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్కోట్లో రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కొత్తగా జామ్నగర్, భావ్నగర్, జునాగఢ్, గాంధీనగర్, ఆనంద్ నదియద్, మెహసానా, మోర్బీ, దహోద్, పఠాన్, గోద్రా, భుజ్, గాంధీదామ్, భరూచ్, సురేంద్రనగర్, అమ్రేలీ నగరాల్లో రాత్రి కర్ఫ్యూ విధించింది.
అదేవిధంగా రాష్ట్రంలో రాజకీయ పార్టీల సభలు, సమావేశాలను ఈ నెలాఖరు వరకు నిషేధించింది. దీంతోపాటు వివాహాలకు హాజరయ్యే అతిథులపై ఆంక్షలు విధించింది. వివాహం వంటి శుభకార్యాలకు 50 మందికి మాత్రమే అనుమతిస్తున్నది. రాష్ట్రంలో నిన్న 3280 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రోజువారీ కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,24,878కు చేరింది. ఇందులో 4598 మంది మరణించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..