స్పెషల్ సెక్రటరీగా రాజేశ్వర్రావు నియామకం
హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): నీతిఆయోగ్లోని కీలక పదవిలో తెలంగాణకు చెందిన వ్యక్తి నియమితులయ్యారు. నల్లగొండ జిల్లాకు చెందిన కొలనుపాక రాజేశ్వర్రావును స్పెషల్ సెక్రటరీగా నియమిస్తూ మంగళవారం కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. డాక్టర్ రాజేశ్వర్రావు 1988 ఐఏఎస్ బ్యాచ్, త్రిపుర క్యాడర్కు చెందినవారు. ప్రస్తుతం నీతిఆయోగ్లో అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. రాజేశ్వర్రావు సోషల్సైన్స్లో డాక్టరేట్ చేశారు. నేషనల్ సెక్యూరిటీలో ఎంఫిల్, సైకాలజీలో, జర్నలిజంలో పీజీ చేశారు. జాతీయస్థాయిలో మినరల్ పాలసీ కమిటీకి చైర్మన్గా వ్యవహరించి విధాన రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. పీఎం జనఆరోగ్య యోజన మార్గదర్శకాలను రూపొందించడంలో ముఖ్యపాత్ర పోషించారు. రాజేశ్వర్రావు భార్య అపర్ణ.. నీటిపారుదలరంగ నిపుణుడు దివంగత ఆర్ విద్యాసాగర్రావు కుమార్తె. ఈ సందర్భంగా రాజేశ్వర్రావు ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ నీతిఆయోగ్లో కీలక పదవిని పొందినందుకు తెలంగాణ వ్యక్తిగా గర్విస్తున్నానని తెలిపారు. ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం తన తల్లి కొలనుపాక రుక్ష్మిణి అని చెప్పారు. తండ్రి చిన్నతనంలోనే చనిపోయినా నలుగురు బిడ్డలను, ముగ్గురు కొడుకులను తన తల్లి పెంచి మంచి చదవులు చదివించిందని, ఆ నేపథ్యమే ఈ స్థాయికి రావడానికి కారణమైందని వివరించారు. తన మేనల్లుళ్లు ఇద్దరు కూడా ఐఏఎస్కు ఎంపికయ్యారని, కృష్ణఆదిత్య ములుగు కలెక్టర్గా, మరొకరు కృష్ణచైతన్య మధ్యప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్గా పనిచేస్తున్నారని తెలిపారు. తన కుమారుడు కూడా కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలో విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
మధ్యవర్తులను ప్రకటిస్తే జవాన్ను అప్పగిస్తాం
బీజేపీ ఎంపీని ఘెరావ్ చేసిన రైతులు
పంజాబ్ నుంచి యూపీకి గ్యాంగ్స్టర్ తరలింపు
మీలాగే.. మేం హిందువులకు పిలుపునిస్తే..
పోలింగ్ ప్రశాంతం.. తీర్పు నిక్షిప్తం
సర్వోన్నత న్యాయపీఠంపై తెలుగు తేజం