శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో మరోమారు డ్రోన్ల కలకలం చెలరేగింది. శుక్రవారం తెల్లవారుజామున 4.25 గంటల ప్రాంతంలో పాకిస్థాన్ వైపు నుంచి వచ్చిన చిన్నపాటి హెలికాప్టర్ (డ్రోన్) సరిహద్దులు దాటడానికి ప్రయత్నించింది. గుర్తించిన బీఎస్ఎఫ్ సైనికులు దానిపై కాల్పులు జరిపారు. వెంటనే అది అటు నుంచి వెనక్కి మళ్లిందని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. డ్రోన్ ద్వారా రెక్కీ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
జమ్మూలోని భారత వైమానిక కేంద్రంపై గత ఆదివారం డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున వైమానిక కేంద్రంలో పేలుళ్లు జరిగాయి. ఈ డ్రోన్ దాడిలో పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హస్తం ఉన్నట్లు జమ్ముకశ్మీర్ పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ కేసును ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారిస్తున్నది. 24 గంటలు గడవకముందే అంటే.. ఆదివారం రాత్రి 11.45 గంటలకు రత్నచక్, కాలూచక్ సైనిక ప్రాంతంలో ఒక డ్రోన్, అర్ధరాత్రి 2.40 గంటలకు ఇంకో డ్రోన్ తిరిగాయి. వీటి కదలికలను గుర్తించిన సైన్యం 25 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో అవి తప్పించుకున్నాయి.