ఆధార్, వన్ రేషన్ – వన్ నేషన్ తరహాలో ఇప్పుడు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వన్ నేషన్ వన్ పర్మిట్ విధానం తీసుకురావాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒకే సిరీస్ ( IN నంబర్ ప్లేట్ )తో వాహనాల రిజిస్ట్రేషన్ చేయాలని యోచిస్తోంది. దీనివల్ల రాష్ట్రాలు మారినప్పుడల్లా అదనంగా రిజిస్ట్రేషన్ ఫీజులు, రోడ్ ట్యాక్స్లు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఎలాంటి అదనపు రుసుం లేకుండా, ఇబ్బంది పడకుండా వ్యక్తిగత వాహనాల్లో రాకపోకలు సాగించవచ్చు. ఈ మేరకు పైలట్ ప్రాజెక్ట్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఇందులో భాగంగా ముందు ప్రభుత్వ ఉద్యోగులు, PSUs , ప్రైవేటు రంగ సంస్థల ఉద్యోగులు, యాజమాన్యాల వాహనాలకు ఈ విధానాన్ని అమలు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్ను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.
ఒక రాష్ట్రంలో ఏదైనా వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే 15 సంవత్సరాల రోడ్ ట్యాక్స్ను ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త వాహనాన్ని కొన్న రెండు, మూడు సంవత్సరాలకే వేరే రాష్ట్రం బదిలీ అయితే మళ్లీ అక్కడ రోడ్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల వాహనదారులపై అదనపు భారం పడుతుంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఈ కొత్త విధానానికి తెరతీసింది. ఈ విధానం ప్రకారం.. IN నంబర్ ప్లేట్ తో వాహనాల బదిలీ, రీ రిజిస్ట్రేషన్ చేయనున్నారు. ఈ రిజిస్ట్రేషన్ చేసుకునే వారు రెండు సంవత్సరాలకు ఒకసారి రోడ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. దీనికోసం ఆర్టీవో ఆఫీసుకు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే మొత్తం ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
రాష్ట్రాల మధ్య వాహనాల బదిలీ ప్రక్రియను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా రోజులుగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం యూనిఫామ్ రోడ్ ట్యాక్స్ విధానం ప్రవేశపెట్టాలని భావించింది. కానీ అది సక్సెస్ కాలేదు. ఈ సమస్యకు ఇప్పుడు ఈ కొత్త విధానం పరిష్కారం చూపిస్తుందని అధికారులు ఆశిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి