బోనకల్లు, ఏప్రిల్ 26: అధికారంలోకి వచ్చి నాలుగున్నర నెలలు గడవక ముందే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ.. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఓట్లను దండుకోవాలని చూస్తోందని దుయ్యబట్టారు. బోనకల్లు మండలం రాయన్నపేట గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని అన్నారు. అలాగే, హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బీఆర్ఎస్లో సీట్ల కేటాయింపులో పార్టీ అధినేత ఎప్పుడూ కేసీఆర్ సమతుల్యం పాటిస్తూనే ఉన్నారని, ఈ ఎన్నికల్లోనూ దాన్ని కొనసాగించారని అన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం భిన్నంగా వ్యవహరించిందని విమర్శించారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో కేవలం రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే ఎక్కువ సీట్లు సీట్లు కేటాయించిందని, మాదిగలకు కనీసం ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం దౌర్భాగ్యమని అన్నారు.
జిల్లాకు చెందిన మంత్రులు కూడా ప్రజల సమస్యలను, హామీలను పక్కనబెట్టి.. తమ కుటుంబ సభ్యులకు ఎంపీ టికెట్లు తెచ్చుకునేందుకు పైరవీలు చేసుకున్నారని విమర్శించారు. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు నిత్యం అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్తా సైనికుడిలా పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు పాటుపడాలని కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారంలో భాగంగా మండలంలో రెండు చోట్ల రోడ్షోలు నిర్వహించనున్నట్లు వివరించారు. బీఆర్ఎస్ నాయకులు చేబ్రోలు మల్లికార్జునరావు, మోదుగుల నాగేశ్వరరావు, వేముల ప్రసాద్, జంగా రవికుమార్, ఇటికాల శ్రీనివాసరావు, జెర్రిపోతుల రవీందర్, హనుమంతరావు, కాకాని శ్రీనివాసరావు, చెల్ది ప్రసాద్, ఉయ్యూరు రాధాకృష్ణ, తోటపల్లి సాయి, గద్దల వెంకటేశ్వర్లు, వెంగళ కనకయ్య, రామమడుగు నరేశ్, షేక్ హుస్సేన్ పాల్గొన్నారు.