Salman Khan | దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ, విద్యా వ్యవస్థ బలోపేతంపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సల్మాన్ ఖాన్ తన విద్యార్థి దశకు సంబంధించిన ఓ పాత ఫోటోను షేర్ చేస్తూ, మెరుగైన విద్యా వ్యవస్థ కోసం యువత ఒక్కటిగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నట్లు సమాచారం. శాంతియుతంగా ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారడం బాధాకరమని, ఈ ఘటనల్లో గాయపడిన విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
పేపర్ లీకేజీ వంటి ఘటనలు దేశ విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని, కష్టపడి చదివే విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. విద్య కోసం విద్యార్థులు ఏకమవడం, వారికి తల్లిదండ్రులు అండగా నిలవడం సానుకూల పరిణామమని పేర్కొన్నారు. అలాగే, ఈ ఉద్యమాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని ఆయన సూచించారు.ఇది పూర్తిగా విద్యార్థుల సమస్య అని, వారి పోరాటానికి గౌరవం ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం కూడా విద్యార్థుల ఆందోళనలను సానుకూలంగా పరిగణించి, విద్యా వ్యవస్థను మరింత పారదర్శకంగా, బలోపేతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
విద్యను దేశ అభివృద్ధికి ప్రధాన శక్తిగా అభివర్ణించిన సల్మాన్ ఖాన్, భవిష్యత్తులో భారతదేశం ప్రపంచ స్థాయి విద్యా కేంద్రంగా ఎదగాలని ఆకాంక్షించారు.. దేశ విదేశాల నుంచి విద్యార్థులు భారతదేశంలో చదువుకునే స్థాయికి విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలన్న సందేశాన్ని ఇచ్చారు. పరీక్షలలో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఈ ఉద్యమానికి సినీ సెలబ్రెటీల నుంచి కూడా చాలా మద్దతు లభిస్తోంది. సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరి, దుల్కర్ సల్మాన్, పూజా భట్, దర్శకుడు ఇమ్తియాజ్ అలీ, సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా సహా ఇప్పటికే కాక్రోచ్లకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.