Swine Flu | నాగపూర్: నాగపూర్లో స్వైన్ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. జూలైలో 15 కేసులు నమోదు కాగా, ఒకరు మరణించారని నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (NMC) వెల్లడించింది. ఈ ఏడాదిలో అక్కడ 25 స్వైన్ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఒక్క జూలైలోనే 15 కేసులు బయటపడ్డాయి.
స్వైన్ఫ్లూ కేసులు పెరగకుండా అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. ఆరోగ్య శాఖ అన్ని జిల్లాల్లోని (Districts) అన్ని డివిజన్లలో శ్వాసకోశతో ఇబ్బందిపడేవారిపై దృష్టిసారించారు. ఇందుకు ప్రతిరోజూ హాస్పిటల్స్కు వచ్చే రోగులను నిశితంగా పరిశీలిస్తున్నారు. అవసరమైన మందులను తగినంతగా సిద్ధంగా ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
స్వైన్ఫ్లూ మరణంపై క్లినికల్ ఆడిట్ (Clinical Audit)ను పరిశీలించాలని ఆరోగ్య కేంద్రాలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జలుబు, విపరీతమైన దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాలని అధికారులు ప్రజలకు సూచనలు జారీ చేశారు.
స్వైన్ఫ్లూ ఇన్ఫ్లూయెంజా A (H1N1) వైరస్ వల్ల సోకుతుంది. ఇది గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. జలుబు, తీవ్ర జ్వరం, గొంతు, ఒళ్లు నొప్పులు, నీరసం, తొలనొప్పి వంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్లను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.