సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : నగరంలో వర్షం శనివారం భారీగా కురిసింది. హయత్నగర్, జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్, మణికొండ, ఉప్పల్, రామాంతాపూర్, ఖైరతాబాద్, మాసబ్ట్యాంక్, నాంపల్లి ప్రాంతాల్లో వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. ఒక్కసారిగా కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీగా స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని రోజులుగా విభిన్న వాతావరణ పరిస్థితులతో నగరం ఉక్కపోతమయంగా మారడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసింది.
ఈ పరిస్థితుల్లో వర్షం కురవడంతో నగరవాసులు ఊపిరిపీల్చుకున్నారు. అత్యధిక వర్షపాతం హయత్నగర్లో 6.3 సెం.మీటర్లుగా నమోదైంది. బాలాపూర్లో 5.9సెం.మీ, రాజేంద్రనగర్లో 4.4సెం.మీ., మైలార్దేవుపల్లిలో 4 సెం.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. కాగా, శనివారం నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24.1డిగ్రీలు, గాలిలో తేమ 79 శాతంగా నమోదైంది. మరో రెండు రోజులు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.