‘ఛలో’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన కన్నడ కస్తూరి రష్మిక మందన్న. ఈ ముద్దుగుమ్మ హీరో విజయ్ దేవరకొండను పెండ్లి చేసుకొని తెలంగాణ కోడలైంది. పుష్ప లాంటి బ్లాక్బస్టర్లో నటించిన రష్మిక తన భర్త విజయ్తో కలిసి ‘రణబాలి’లో జతకట్టింది. ముచ్చటగా మూడోసారి దేవరకొండతో నటిస్తున్నా.. పెండ్లి తర్వాత ఈ జంట కలిసి చేస్తున్న మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా ఈ బ్యూటీ పంచుకున్న కార్వాన్ కబుర్లివి..
ఇటీవల షూటింగ్లో గాయపడటంతో ఇంటికే పరిమితమయ్యాను. ఇన్నిరోజులు ఇంట్లో ఉండటం నా కెరీర్లోనే మొదటిసారి అనుకుంటా. షూటింగ్ల వల్ల నిత్యం ఒక చోటు నుంచి మరో చోటుకు
వెళ్లే నాకు ఇదో కొత్త అనుభవం. పెండ్లయిన తర్వాత కూడా విజయ్, నేను మూడు నెలలపాటు ఒకరినొకరం చూసుకోలేదు. పెండ్లి తర్వాత ఇంట్లోవాళ్లతో గడిపే అవకాశం లభించినందుకు ఒకింత సంతోషంగా ఉంది.
రణబాలితో పాటు ‘మైసా’లో లీడ్ రోల్ చేస్తున్నాను. ఇందులో గోండు తెగకు చెందిన వారియర్లా కనిపిస్తాను. ఈ పాత్ర కోసం శారీరకంగా, మానసికంగా ఎంతో కఠిన శిక్షణ తీసుకున్నాను. ఇందులో నీటి అడుగున శ్వాస బిగబట్టి చేసే యాక్షన్ సీన్ చేశాను. ఆసియాలోనే ఈ తరహా సీన్ చేసిన తొలి ఫీమెల్ యాక్టర్ నేనే అనుకుంటా.
దేవరకొండ కుటుంబంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. మా అత్త స్వీట్గా, పసిపాపలాగా అమాయకంగా ఉంటుందని నేను ముద్దుగా ఆమెను ‘పాపా’ అని పిలుస్తాను. విజయ్కు సీరియస్ డ్రామాలు, షోలంటే ఇష్టం. నాకేమో కొరియన్ డ్రామాలు అంటే పిచ్చి. ఇప్పుడు ఆయనకు కూడా కే-డ్రామాలు అలవాటు చేశాను.
నా దృష్టిలో సక్సెస్ అంటే పర్ఫెక్ట్ ఇమేజ్ కాదు. ఎంత ఎదుగుతున్నా సరే మనం మనలా ఉంటూ ప్రేక్షకులతో నిజాయతీగా ఉండటమే. అలాంటి నిజాయతీని ఎప్పటికైనా ప్రేక్షకులు గుర్తిస్తారు.
బిజీ షెడ్యూల్లో కాస్త తీరిక దొరికినప్పుడు స్కిన్, హెయిర్ కేర్ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను. గోరు వెచ్చని కొబ్బరి నూనెను ముఖానికి, తలకు పట్టించి చక్కగా మర్దనా చేసుకుంటా. ఏ మాయిశ్చరైజర్, హెయిర్ కండీషనర్ అవసరం లేదు. వీలు దొరికినప్పుడల్లా నేను ఇదే చేస్తా. ఇది మా అమ్మమ్మ, అమ్మ చెప్పిన చిట్కా.