సిటీబ్యూరో/ఎల్బీనగర్ /ఆర్కేపురం, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. పేదలకు అందించే ఇండ్ల పట్టాల కార్యక్రమాన్ని సైతం కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సరూర్నగర్ ఇండోర్స్టేడియంలో నగరంలోని పలు ప్రాంతాల నివాసితులకు ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు అడుగడుగున అడ్డంకులు సృష్టించారు.
క్యాంప్ కార్యాలయం చుట్టు వందలాది మంది పోలీసులు మోహరించారు. దీంతో సుధీర్ రెడ్డి మరో దారిలో కాన్వాయ్ పక్కనపెట్టి ద్విచక్రంపై ప్రయాణించి ఎట్టకేలకు సమావేశానికి చేరుకున్నారు. ఈ క్రమంలో తనను అడ్డుకునేందుకు యత్నించిన పోలీసుల చర్యలను సభావేదికపై మంత్రి పొంగులేటికి వివరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సభపై ఉన్న కాంగ్రెస్ నాయకులు విచక్షణ మరిచి ఏకవచనంతో అడ్డగోలు నినాదాలు చేశారు. సుధీర్ రెడ్డి ఉపన్యాసానికి అడ్డుతగిలారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మంత్రి పొంగులేటి సమక్షంలోనే కాంగ్రెస్ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్తో నోరు మూయించారు.
‘మా గొంతు నొక్కాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. మీ ఆగడాలను అడ్డుకొని తీరుతాం.’ అంటూ సుధీర్ రెడ్డి ఘాటుగా హెచ్చరించారు. జీవో 118 ద్వారా గత కేసీఆర్ ప్రభుత్వం హయాంలోనే కన్వియన్స్ డీడ్లను ఇచ్చినప్పటికీ ప్రస్తుతం మిగిలిపోయిన వారికి ఈ డీడ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. ఆ వేదికను కాంగ్రెస్ నేతలతో నింపి కార్యక్రమాన్ని తమకు అనుకూలంగా చేసుకోవాలని చూశారు.
ఈ సందర్భంగా సుధీర్రెడ్డికి అనుకూలంగా బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేయడంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉద్రిక్త వాతవరణం నెలకొన్నది. ఓ దశలో అధికారిక కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలతోనే సమావేశం ఎలా చేస్తారంటూ ప్రశ్నించడంతో కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాగా, స్టేజికి వెనుకవైపు కూర్చున్న లింగోజిగూడా డివిజన్కు చెందిన మాజీ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్రెడ్డి అనుచరుడైన ఓ నాయకుడు కేసీఆర్, కేటీఆర్పై చేసిన కామెంట్లపై ఎమ్మెల్యే సుధీర్రెడ్డి సీరియస్ అయ్యారు.