ముంబై: అక్టోబర్ 15 నుంచి మధ్యప్రదేశ్తో పాటు ముంబై మహానగరంలోని పెట్రోల్ బంకుల్లో యూపీఐ చెల్లింపులను నిలిపివేయనున్నట్లు పెట్రోల్ డీలర్లు హెచ్చరించారు. రూ. 2000కు మించిన లావాదేవీలపై విధించిన కొత్త మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) నుంచి ఇంధన విక్రయదారులకు మినహాయింపు ఇవ్వకపోతే ఈ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ముంబై(పీడీఏఎం) ఈ అంశంపై భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ), కేంద్ర ఆర్థికశాఖకు లేఖ రాసింది. ఇంధన రిటైలర్లకు ఎండీఆర్ చార్జీలను మినహాయించాలని కోరింది. ఈ ఛార్జీలను వెనక్కి తీసుకోకపోతే యూపీఐ సదుపాయాన్ని ఉపసంహరించుకుంటామని హెచ్చరించింది. మధ్యప్రదేశ్ పెట్రోల్ పంప్స్ డీలర్స్ అసోసియేషన కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఐఏటీ) మధ్యప్రదేశ్ ప్రతినిధి ధర్మేంద్ర శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలోని సుమారు 4,700 పెట్రోల్ బంక్లపై ఈ నిర్ణయం ప్రభావం చూపుతుందన్నారు. కొత్త విధానం అమల్లోకి వస్తే ఒక్కో పెట్రోల్ బంక్కు నెలకు సుమారు రూ. 17,700 వరకు అదనపు భారం పడుతుందని ఆయన పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను తమ ఇష్టానుసారం నిర్ణయించే అవకాశం డీలర్లకు లేకపోవడంతో ఎండీఆర్ రూపంలో వచ్చే అదనపు ఖర్చును వినియోగదారులపై నేరుగా మోపలేమని ఆపరేటర్లు అంటున్నారు.
యూపీఐ లావాదేవీలపై ప్రభుత్వం విధించనున్న చార్జీలకు వ్యతిరేకంగా యూపీలోని వర్తకులు ఆందోళనకు దిగుతున్నారు. ఘజియాబాద్లోని పలు దుకాణాలలో ఇప్పటికే యూపీఐ చెల్లింపులు అంగీకరించబోమంటూ నోటీసులు అంటించడం విశేషం. రెండు వేల రూపాయలకు పైగా జరిగే లావాదేవీలపై అక్టోబర్ 15 నుంచి మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) 0.4 శాతం విధిస్తామంటూ కేంద్రం ఇటీవల ఆదేశాలు జారీ చేయడంతో వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కేవలం వర్తకులకు మాత్రమే విధిస్తామని ప్రభుత్వం చెబుతున్నా, అంతిమంగా ఆ చార్జీ వినియోగదారుల మీద మోపుతారన్నది అందరికీ తెలిసిందే. దీంతో అక్టోబర్ 15 తర్వాత రెండు వేలకు పైగా లావాదేవీలు జరిపే వారు నగదును తీసుకురావాలంటూ పౌరులకు వ్యాపారులు సూచిస్తున్నారు.