మామిళ్లగూడెం, ఏప్రిల్ 26 : పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది రెండో దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఖమ్మం కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీపీ గౌతమ్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్.. ఎన్నికల సాధారణ పరిశీలకుడు డాక్టర్ సంజయ్ జి.కోల్టేతో కలిసి రెండో దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ర్యాండమైజేషన్లో అసెంబ్లీ సెగ్మెంట్ల కేటాయింపు ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 1,459 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వీటికి ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారి, ఓపీఓలను కేటాయించామన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం 20 శాతం అదనంగా సిబ్బందిని కేటాయించామన్నారు. ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని 355 పోలింగ్ కేంద్రాలకు, పాలేరు 290, మధిర 268, వైరా 216, సత్తుపల్లి సెగ్మెంట్ పరిధిలోని 294 పోలింగ్ కేంద్రాలకు పారదర్శకంగా ఎన్ఐసీ సాఫ్ట్వేర్ వినియోగిస్తూ ఆన్లైన్లో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.సత్యప్రసాద్, డి.మధుసూదన్నాయక్, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్, మిర్నల్ శ్రేష్ఠ, డీఆర్వో రాజేశ్వరి, డీఈవో సోమశేఖర శర్మ, కలెక్టరేట్ ఏవో అరుణ తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ సిబ్బందికి రెండో దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. శుక్రవారం ఐడీవోసీలోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాంకుమార్ గోపాల్తో కలిసి ఎన్ఐసీ రూపొందించిన స్టాఫ్వేర్ ద్వారా ఆన్లైన్లో పోలింగ్ సిబ్బందికి రెండో దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 962 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. 9 యాక్సిలరీ పోలింగ్స్టేషన్ల ప్రపోజల్ కోసం రాష్ట్ర ఎన్నికల అధికారికి నివేదిక పంపించామన్నారు. రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియలో భాగంగా 1,162 మంది ప్రిసైడింగ్, 1,162 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 2,324 మంది ఓపీవోలను కేటాయించామన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం అదనపు సిబ్బందిని కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ దారా ప్రసాద్, ఎన్ఐసీ డీఐవో సుశీల్కుమార్, డీఎల్ఎంటీ పి.సాయికృష్ణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.