భోపాల్: కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్లోని పట్టణ ప్రాంతాల్లో 60 గంటల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు గురువారం ప్రకటించారు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఈ లాక్డౌన్ అమల్లో ఉండనుంది. సంక్షోభ నిర్వహణ బృందం సమావేశం తర్వాత కేసులు పెరిగిపోతున్న పట్టణాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయం తీసుకుంటామని శివరాజ్సింగ్ చెప్పారు. పెద్ద నగరాల్లో మరోసారి కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
గత 24 గంటల్లోనే మధ్యప్రదేశ్లో 4 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం 3.18 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. మధ్యప్రదేశ్లో పెద్ద నగరాలైన ఇండోర్, భోపాల్లలో కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇండోర్లోనే గత 24 గంటల్లో 866 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా కారణంగా 4 వేల మందికిపైగా చనిపోయారు.