Lightning Strikes | ఒడిశా (Odisha)లో అసాధారణ పరిస్థితి నెలకొంది. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం స్తంభించింది. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో పిడుగులు (Lightning Strikes) బీభత్సం సృష్టిస్తున్నాయి. గంటల వ్యవధిలోనే ఎకంగా వేల పిడుగుల పడ్డాయి.
శనివారం 2 గంటల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 61 వేల పిడుగులు పడినట్లు అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పడిన పిడుగుల కారణంగా సుమారు 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 14 మంది గాయపడినట్లు తెలిపారు. ఖుర్దా జిల్లాలో నలుగురు, బలంగీర్లో ఇద్దరు, అంగుల్, బౌధ్, ధెంకనల్, గజపతి, జగత్సింగ్పూర్, పూరీలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 12 మంది మరణించారు. గజపతి, కంధమాల్ జిల్లాల్లో పిడుగు పాటుకు ఎనిమిది పశువులు కూడా చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. పిడుగుల కారణంగా మృతి చెందిన ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం రూ.4 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
మరోవైపు సెప్టెంబర్ 7వ తేదీ వరకు రాష్ట్రంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు ఉంటాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 48 గంటల్లో అల్పపీడనంగా మారొచ్చని పేర్కొంది. దాని ప్రభావంతో ఒడిశా అంతటా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read..
Gender Reveal Party | హ్యాపీ మూడ్తో పార్టీ షురూ.. ఊహించని ఘటనతో విషాదాంతం.. Video
G20 Summit | జీ20 సమ్మిట్కు జిన్పింగ్ గైర్హాజరు : ప్రకటించిన చైనా