G20 Summit | ఢిల్లీలో జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశాల (G20 Summit)కు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ (Xi Jinping) హాజరుకావడం లేదు. ఈ విషయాన్ని చైనా ధ్రువీకరించింది. ఈ సదస్సుకు అధ్యక్షుడికి బదులు ప్రధాని లీ కియాంగ్ ( Li Qiang) హాజరవుతారని సోమవారం ప్రకటించింది. ‘భారత ప్రభుత్వం ఆహ్వానం మేరకు స్టేట్ కౌన్సిల్ ప్రధాని లీ కియాంగ్, ఢిల్లీలో సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జరిగే 18వ జీ-20 సదస్సుకు హాజరుకానున్నారు’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ (Mao Ning) ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, అధ్యక్షుడు హాజరుకాకపోవడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.
ప్రస్తుతం భారత్ (India), చైనా (China) మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల చైనా రిలీజ్ చేసిన కొత్త మ్యాప్ పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ ప్రదేశాలను తమ భూభాగంలో ఉన్నట్లు చైనా తన మ్యాప్లో ప్రచురించింది. దీన్ని భారత్ ఖండిస్తూ తన నిరసనను వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య మళ్లీ ప్రచ్ఛన్న వాతావరణం నెలకొంది. అందుకే జిన్పింగ్ జీ20 సమావేశాల కోసం ఇండియా రావడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
సెప్టెంబర్ 9-10 తేదీల్లో ఢిల్లీలో G-20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సహా పలు దేశాల అధ్యక్షులు ఈ సమ్మిట్కు స్వయంగా హాజరవుతున్నారు. కాగా, భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ, జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగే అవకాశం ఉండొచ్చని అంతా భావించారు. అయితే, సమ్మిట్కు జిన్పింగ్ హాజరు కావడంలేదని చైనా స్వయంగా ప్రకటించేసింది.
Also Read..
Harish Salve | 68 ఏళ్ల వయసులో ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న టాప్ లాయర్.. హాజరైన ప్రముఖులు
Viral Video | ట్రాఫిక్ను తప్పించుకునేందుకు.. ఆటోను ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఎక్కించేసిన డ్రైవర్