యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ):యాదాద్రి క్షేత్రానికి సీఎం కేసీఆర్ అనుకున్న షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఉదయం 11:50గంటలకు రోడ్డు మార్గంలో చేరుకున్నారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. అక్కడ కాసేపు బస్సును నిలిపారు. అనంతరం పుణ్యక్షేత్రం చుట్టూ గిరిప్రదక్షిణతో కేసీఆర్ కార్యక్రమాన్ని ఆరంభించారు. ఆ తర్వాత ప్రెసిడెన్షియల్ సూట్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైటీడీఏ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అక్కడి నుంచి యాదాద్రి కొండపైకి వచ్చారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి లిఫ్ట్ ద్వారా గుట్టపైకి విచ్చేశారు. అక్కడ ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభం ద్వారా ఘన స్వాగతం పలికారు. తిరువీధుల గుండా కేసీఆర్తోపాటు కుటుంబ సభ్యులు దర్శనానికి వెళ్లారు. స్వామి, అమ్మవార్లకు సమర్పించే పట్టు వస్ర్తాలను సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు తలపై పెట్టి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులంతా ఆలయ ప్రధాన ద్వారం నుంచి దర్శనం కోసం గర్భగుడికి వెళ్లారు. సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన పూజారి నరసింహాచార్యులు ఆధ్వర్యంలో గోత్రనామాలు చదివారు. అనంతరం కేసీఆర్-శోభ దంపతులకు ఆశీర్వచనం చేశారు. కేసీఆర్తోపాటు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి కుటుంబ సభ్యులు కూడా పూజలు, ఆశీర్వచనాల్లో పాల్గొన్నారు. అనంతరం పూజారులు తీర్థప్రసాదాలను అందించారు. సుమారు అర్ధ గంటకు పైగా గుడిలో కేసీఆర్ ఆధ్యాత్మిక వాతావరణంలో గడిపారు.
సీఎం కేసీఆర్ పర్యటన సాగిందిలా..
యాదగిరిగుట్టకు శుక్రవారం ఉదయం 11.50 గంటలకు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రగతిరథంలో కొండ చుట్టూ గిరిప్రదక్షిణ చేశారు. ఈ క్రమంలో కొండ చుట్టూ రింగురోడ్డును, స్వామివారి తెప్పోత్సవం కోసం నిర్మితమవుతున్న గండి చెరువును పరిశీలించారు. అనంతరం ప్రెసిడెన్సియల్ సూట్కు వెళ్లారు. అక్కడ వైటీడీఏ అధికారులతో గంటపాటు సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఇచ్చిన హామీ ప్రకారం కుటుంబం తరఫున స్వామివారి విమాన గోపురం స్వర్ణతాపడం విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్ష్ ఆలయ ఈఓ ఎన్.గీతకు అందజేశారు. ఆలయ మాఢవీధుల్లోకి వచ్చిన సీఎం కేసీఆర్.. సంగీత భవన్ నిర్మించే స్థలం, టెంపుల్ సిటీని పరిశీలించారు. అనంతరం ప్రెసిడెన్సియల్ సూట్కు వెళ్లి భోజనం చేసి, తిరిగి రోడ్డు మార్గం గుండా హైదరాబాద్కు బయల్దేరి వెళ్లారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. 108, అగ్నిమాపక వాహనాలతోపాటు పలు అత్యవసర సేవా విభాగాలను అందుబాటులో ఉంచారు. యాదగిరిగుట్ట పట్టణంలోని పరిసర ప్రాంతాలను పోలీసులు ముందస్తుగా తమ ఆధీనంలోకి తీసుకుని భారీ భద్రత, నిఘా ఏర్పాటు చేశారు. యాదాద్రి ఆలయ పరిసరాలు, సమీప ప్రాంతాల్లో పోలీస్ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో నిఘాను రెట్టింపు చేసి ట్రాఫిక్ను నియంత్రించారు. దాదాపు 5 గంటలపాటు సాగిన ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
పటిష్ట పోలీసు బందోబస్తు..
సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో డీసీపీ నారాయణరెడ్డి పర్యవేక్షణలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు వెయ్యి మందికి పైగా పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. ఇందులో ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు ఉన్నారు. రోడ్డు మార్గంలో రావడంతో బీబీనగర్ నుంచి యాదాద్రి వరకు పోలీసులు భద్రతా చర్యలు తీసుకున్నారు. యాదాద్రి కొండపైన, కింది భాగంలో, ప్రెసిడెన్షియల్ సూట్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కొండ కింద ఉత్తర భాగంలో ఎగ్జిట్ ఫ్లైఓవర్ నుంచి కొండపైకి వెళ్లి, అదే మార్గంలో తిరుగు ప్రయాణంలో వెళ్లారు. ముఖ్యమంత్రి టూర్లో ఎలాంటి ఆటంకాలూ లేకుండా చర్యలు తీసుకొని సక్సెస్ అయ్యారు.
నిర్మాణ పనులపై వైటీడీఏ అధికారులతో సమీక్ష..
సీఎం కేసీఆర్ గిరిప్రదక్షిణ అనంతరం ప్రెసిడెన్షియల్ సూట్కు వెళ్లి అక్కడే వైటీడీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొండ కింద కొనసాగుతున్న సత్యనారాయణ వ్రత మండపం, బస్ స్టేషన్, గండిచెరువు ఆధునీకరణ పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏయే పనులు ఎంత వరకు వచ్చాయి.. ఇంకా ఎంత సమయం పడుతుంది..? తదితర వివరాలపై ఆరా తీశారు. నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్రావు, బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, సుధీర్రెడ్డి, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈఓ గీతారెడ్డి, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి పాల్గొన్నారు.
ఆలయ వీధుల్లో కలియ తిరుగుతూ..
ప్రత్యేక పూజలు, ఆశీర్వచనం అనంతరం ప్రధాన ద్వారం గుండానే ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు బయటకు వచ్చారు. అక్కడి నుంచి కేసీఆర్ ఆలయ వీధులన్నీ కలియతిరిగారు. దర్శనం తర్వాత బయటకు రాగానే ప్రధాన ద్వారం ఎదురుగా ఉన్న వీధులన్నీ పరిశీలించారు. భక్తుల క్యూలైన్ గురించి అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అటు నుంచి గతంలో ఉన్న బాలాలయం ప్రదేశం వైపు వెళ్లారు. అక్కడ కొత్తగా చేపట్టాల్సిన నిర్మాణాలపై అధికారులతో మాట్లాడారు. ఆ తర్వాత భక్తుల కాంప్లెక్స్పై ఆరా తీశారు. అనంతరం ఆలయ పరిసరాలన్నీ తిరుగుతూ అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. అక్కడి నుంచి లిఫ్ట్లో కిందికి ప్రెసిడెన్షియల్ సూట్కు వెళ్లారు.
1.16 కిలోల బంగారం విరాళం..
ఆలయంలోని దివ్య విమాన గోపురం బంగారు తాపడానికి సీఎం కేసీఆర్ 1.16 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన రూ.52,48,097.20 చెక్కును సీఎం కేసీఆర్ కుటుంబం తరఫున హిమాన్షు గర్భగుడిలో ఆలయ అధికారులకు అందించారు. కేసీఆర్తోపాటు హైదరాబాద్కు చెందిన రజిత రూ.30,15,000, ఎమ్మెల్యే జీవన్రెడ్డి 20లక్షలు, స్నేహిత బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 51,00,624, ఏనుగు దయానంద్ 50,04,000 రూపాయల చెక్కులను అందజేశారు. దీంతో శుక్రవారం ఒక్కరోజే రూ.2,03,67,721.20 బంగారు తాపడానికి విరాళాలు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తంగా 23,99,72,230 నగదు, 7.877కిలోల బంగారం దాతల ద్వారా అందినట్లు పేర్కొన్నారు.