నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్రకు ఉమ్మడి జిల్లా పరిధిలో సర్వం సిద్ధమైంది. బుధవారం సాయంత్రం మిర్యాలగూడ, రాత్రి సూర్యాపేటలో, గురువారం సాయంత్రం భువనగిరిలో కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనున్నది. అందుకోసం మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు కలిసి ఏర్పాట్లు పూర్తి చేశారు. కేసీఆర్ బస్సుయాత్ర సాగే రూట్లో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల వేళ తలపెట్టిన బస్సుయాత్రకు నల్లగొండ జిల్లా వేదిక కావడంతో రాజకీయంగా అందరి దృష్టి దీనిపై కేంద్రీకృతమైంది.
కాంగ్రెస్ నాలుగున్నర నెలల మోసపూరిత పాలనను ఎండగట్టి ప్రజలను చైతన్యం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తలపెట్టిన బస్సుయాత్ర బుధవారం నల్లగొండ జిల్లాను నుంచి మొదలుకానున్నది. వచ్చే నెల 11వరకు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని నియోజకవర్గాలను కలుపుతూ బస్సుయాత్ర సాగనున్నది. ఈ బస్సుయాత్రకు తొలి వేదికగా నల్లగొండ జిల్లా నిలువనున్నది.
పార్టీ వర్గాలు తెలిపిన ప్రకారం.. నేడు మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్లోని తెలంగాణ భవన్ నుంచి కేసీఆర్ బయల్దేరనున్నారు. బస్సుయాత్ర ఉప్పల్, ఎల్బీనగర్ మీదుగా జిల్లాలోకి ప్రవేశించనున్నది. చౌటుప్పల్ వద్ద పార్టీ శ్రేణులు కేసీఆర్ బస్సు యాత్రకు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యాయి. ఆ తర్వాత చిట్యాల, నార్కట్పల్లిల్లోనూ పార్టీ శ్రేణుల స్వాగతంతో నల్లగొండ మీదుగా సాయంత్రం 5:30 గంటలకు మిర్యాలగూడకు చేరుకోనున్నది. మార్గమధ్యంలో మర్రిగూడ బైపాస్, తిప్పర్తి, వేములపల్లిల్లో బస్సుయాత్రకు స్వాగతం పలుకనున్నారు. మిర్యాలగూడ పట్టణంలోకి సాగర్ రోడ్డులోని ఫ్లైఓవర్ కిందుగా బస్టాండ్ వరకు చేరుకోనున్నది. అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీగా కేసీఆర్ బస్సుయాత్రను రాజీవ్ చౌక్ వద్దకు తోడ్కోని వెళ్లనున్నాయి. అక్కడ ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించనున్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో..
మిర్యాలగూడ నుంచి కేసీఆర్ బస్సుయాత్ర సూర్యాపేటకు వెళ్లనున్నది. సాయంత్రం 6:15గంటలకు బయల్దేరి వేములపల్లి, తిప్పర్తి, నకిరేకల్ బైపాస్, కేతేపల్లి మీదుగా సూర్యాపేటకు చేరుకుంటుంది. రాత్రి 7గంటలకు సూర్యాపేటలోని కర్నల్ సంతోష్కుమార్ చౌరస్తా నుంచి పోస్టాఫీస్ చౌరస్తా వరకు భారీ రోడ్ షో కొనసాగనున్నది. పోస్టాఫీస్ చౌరస్తాలో కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాత్రి సూర్యాపేటలోని జగదీశ్రెడ్డి నివాసంలో కేసీఆర్ బస చేస్తారు. గురువారం సాయంత్రం వరకు జిల్లా పార్టీ ముఖ్యులతో కేసీఆర్ సమావేశం అవుతారని సమాచారం. జిల్లాలో పరిస్థితి, ఎన్నికల ప్రచారం, ప్రచార ఏజెండా తదితర అంశాలపై దిశా నిర్దేశం చేస్తారని తెలిసింది. అనంతరం సాయంత్రం 5 గంటలకు సూర్యాపేట నుంచి బస్సుయాత్ర భువనగిరికి బయల్దేరి వెళ్తుంది. భువనగిరి పట్టణంలో సాయంత్రం ఏడు గంటలకు భారీ రోడ్షోలో కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి ఎర్రవెళ్లిలోని ఫాంహౌస్కు కేసీఆర్ చేరుకోనున్నారు. కాగా, ఉమ్మడి జిల్లా పరిధిలో కేసీఆర్ బస్సుయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను మాజీ మంత్రి జగదీశ్రెడ్డి స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షులు, అభ్యర్థులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలను సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు కేసీఆర్ బస్సుయాత్రకు ఉమ్మడి జిల్లా ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించేలా కార్యాచరణ చేపట్టారు. కేసీఆర్ జిల్లా పర్యటనకు పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలిరావచ్చేలా చర్యలు చేపట్టారు. కేసీఆర్తోనే తెలంగాణ ప్రజల హక్కులు కాపాడబడతాయని, రాష్ట్రం సురక్షితంగా ఉంటుందని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ఎండగట్టడానికి కేసీఆర్ బస్సుయాత్రగా బయల్దేరుతారని, ప్రజలంతా భారీగా తరలిరావాలని ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు.