PM Modi | హైదరాబాద్, ఏప్రిల్ 24 (స్పెషల్ టాస్క్ బ్యూరో- నమస్తే తెలంగాణ): మోదీ పాలనలో పేద, మధ్యతరగతి కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ప్రజల పొదుపు సామర్థ్యం కనీవినీ ఎరుగని రీతిలో పడిపోయింది. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభం అంచుకు చేరే ప్రమాదం దాపురించింది. ఈ మేరకు ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మోతీలాల్ ఓస్వాల్ తాజా సర్వేలో పేర్కొన్న కీలక అంశాలను విశ్లేషిస్తే అర్థమవుతున్నది.
ఒకవైపు ప్రజల ఆదాయంతో పాటు పొదుపు సామర్థ్యం తగ్గడం, ఇదే సమయంలో రుణాల భారం పెరగడంతో దేశంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోయిందని మోతీలాల్ ఓస్వాల్ నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ముగింపు నాటికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కుటుంబాల అప్పు స్థాయి 39.1 శాతానికి చేరినట్టు వెల్లడించింది. 2021-22 నాలుగో త్రైమాసికంలో ఈ అప్పుల స్థాయి 38.6 శాతంగానే ఉన్నదని, ఏటికేడూ 16.5 శాతం వృద్ధితో ప్రస్తుతం దాదాపు 40 శాతానికి చేరువైనట్టు వివరించింది. ఇక, నిత్యావసరాలు, స్కూల్ ఫీజులు, సేవలు ఇలా అన్ని రంగాల్లోనూ వస్తు ఉత్పత్తుల ధరలు పెరుగుతుండటంతో ప్రజల పొదుపు సామర్థ్యం క్రమేణా తగ్గిపోతున్నదని నివేదిక వెల్లడించింది. ప్రధానంగా టెలికం, ఆటో, ఇంధనం, ఎఫ్ఎంసీజీ రంగాల్లో ధరాఘాతం.. వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నట్టు అంచనా వేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సెప్టెంబర్ 2023లోని అంచనా ప్రకారం.. 2022-23లో ప్రజల నికర ఆర్థిక పొదుపు 47 ఏండ్ల కనిష్ఠాన్ని తాకుతూ దేశ జీడీపీలో 5.1 శాతానికే పరిమితమైనట్టు నివేదిక ఉటంకించింది. వెరసి బీజేపీ సర్కారు పాలనలో దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలు డబ్బును పొదుపు చేయడాన్ని ఎప్పుడో మరిచిపోయి.. కొత్తగా అప్పులు చేయాల్సిన దుస్థితి వాటిల్లిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.