నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజలను చైతన్యం చేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తలపెట్టిన బస్సుయాత్రకు తొలిరోజు నల్లగొండ జిల్లాలో అడుగడుగునా జనం నీరాజనం పట్టారు. మధ్యాహ్నం నుంచే ఎర్రటి ఎండను లెక్క చేయకుండా అభిమాన నేత రాక కోసం దారిపొడవునా ప్రజలు ఎదురుచూశారు. పలుచోట్ల రైతులు ఎదురొచ్చి తమ సమస్యలను ఏకరువు పెట్టగా, వారికి ధైర్యం చెప్తూ కేసీఆర్ ముందుకు సాగారు. మిర్యాలగూడ శివారులోకి బస్సుయాత్ర ప్రవేశించగానే జనం ఎదురువెళ్లి స్వాగతం పలికారు. సాగర్ రోడ్డులోని ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి రెండు కిలోమీటర్ల మేర జనం బారులు తీరారు. ఫ్లైఓవర్ కింద నుంచి పట్టణంలోకి బస్సు యాత్ర టర్న్ తీసుకోగానే జనం కేరింతలు కొట్టారు. బస్సు ముందు సీట్లో కూర్చున్న కేసీఆర్ ప్రజలకు అభివాదం చేశారు. సాయంత్రం 6.10 గంటలకు బస్సుయాత్ర పట్టణంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి రెండు కిలోమీటర్ల మేర ముందుకు సాగడానికి 40 నిమిషాల సమయం పట్టింది. పెద్దఎత్తున తరలిచ్చిన యువత, మహిళలు, రైతులు కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సుతోపాటు కాలినడక ముందుకు సాగారు. జై కేసీఆర్.. జైజై కేసీఆర్.. సీఎం.. సీఎం.. అంటూ నినాదాలతో దారంతా దద్దరిల్లింది. మరోవైపు పార్టీ శ్రేణులు, అభిమానులు ముఖ్య కూడళ్ల వద్ద కేసీఆర్ బస్సుపై విరామం లేకుండా పూల వర్షం కురిపించారు. బస్టాండ్ నుంచి రాజీవ్ చౌక్ వరకు దారంతా పూలమయమైంది. రోడ్షోలో అగ్రభాగాన మహిళల బోనాలు, గోండు నృత్యాలు, డప్పుల చప్పుళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాజీవ్ చౌక్ వద్ద కేసీఆర్ ప్రసంగానికి జనం నుంచి భారీ స్పందన లభించింది. మధ్యమధ్యలో సీఎం.. సీఎం అంటూ జనం చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. కేసీఆర్ రోడ్ షో సందర్భంగా ఎటుచూసినా జనసంద్రాన్ని తలపించింది.
కేసీఆర్ ప్రసంగం 19 నిమిషాలపాటు కొనసాగగా ఆద్యంతం చప్పట్లు, ఈలలు, కేరింతలతో జనం స్పందించారు. ఆ రోజు సాగర్ కెనాల్కు నీళ్లివ్వకుండా అన్యాయం చేస్తే కోదాడ నుంచి పాదయాత్ర చేసుకుంటూ మిర్యాలగూడ వచ్చానని కేసీఆర్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టగానే ఒక్కసారిగా జనం చప్పట్లతో స్వాగతం పలికారు. రాష్ట్రంలో నాలుగైదు నెలల క్రితం ధీమాగా ఉన్న రైతులు ఇయ్యాల దిగాలుగా ఉన్నారు అనగానే ‘అవును.. అవును’ అంటూ స్పందించారు. ‘ఇరిగేషన్ మంత్రి ఇక్కడి వాడే.. దద్దమ్మలాగా సాగర్ కట్టను కేఆర్ఎంబీకి అప్పజెప్పారు’ అని చెప్పగా.. చప్పట్లు మార్మోగాయి. 1956 నుంచి ఇప్పటివరకు మనకు కాంగ్రెస్ పార్టీనే శత్రువుని కేసీఆర్ అనగా.. కేరింతలు కొట్టారు. బీఆర్ఎస్ పరిపాలనలో 18 పంటలకు సాగర్ నీళ్లిచ్చినం.. బంగారు పంటలు పండించినం అంటూ కేసీఆర్ చెప్పగా అవునని చేతులెత్తారు. సాగునీళ్లు, రైతుబంధు, రుణమాఫీ, కరెంటు ఇలా వ్యవసాయం గురించి కేసీఆర్ ప్రస్తావించిన ప్రతీసారి రైతుల నుంచి భారీ స్పందన లభించింది. డిసెంబర్ 9న రెండు లక్షల రుణమాఫీ చేస్తమన్నరు… చేసిండ్రా అని ప్రశ్నిస్తే లేదు లేదు అంటూ చేతులెత్తారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తమని చెప్పుతుండ్రు.. వీటికి కేసీఆర్ భయపడుతడా.. అంటే లేదంటూ ప్రాంగణమంతా దద్దరిలిపోయే బదులు వచ్చింది. ప్రజల పక్షాన కొట్లాడే పెద్దమనిషి ఎవరంటే… కేసీఆర్ అంటూ జనం స్పందించారు. మీరంతా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించి బలమిస్తరా అంటే ‘ఇస్తాం.. ఇస్తాం..’అంటూ జనం చప్పట్లతో సమ్మతి తెలిపారు. మీ బలంతోనే కేసీఆర్కు బలమంటూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.
రోడ్షోకు తరలివచ్చిన ప్రజలు కేసీఆర్ను చూసి ఉబ్బితబ్బిబైపోయారు. కేసీఆర్ బస్సుపైకి వస్తుంటే నిక్కినిక్కి చూస్తూ సెల్ఫోన్లలో బంధిస్తూ కనిపించారు. రాంచంద్రపురానికి చెందిన అంజమ్మ తన చంటిపిల్లాడిని భుజాలపైకి ఎత్తుకుని కేసీఆర్ తాత అంటూ చూపుతుండడం అందరినీ ఆకర్షించింది. ఉట్లపల్లికి చెందిన రంగారెడ్డి అనే రైతును కదిలిస్తే… కేసీఆర్తోనే సాగర్ నీళ్లు వచ్చినయ్ అని .. ఇప్పుడు నీళ్లాగిపోయినవ్.. ఏం చెప్తడో విందామని అని బదులిచ్చారు. వేములపల్లికి చెందిన మల్లయ్య అనే వృద్ధుడు జనంలో నుంచి కేసీఆర్ను చూసేందుకు తెగ ఆరాటపడటం కనిపించింది. ఏందీ పెద్దమనిషి అంటే.. ‘పెన్షన్ ఇచ్చి బతికిస్తున్నడు కేసీఆరే. మళ్లా ఆయనొస్తేనే మాలాంటి ముసలోళ్లకు ఆదరువు’ అంటూ చెప్పుకొచ్చారు. ఇలా రోడ్షో ప్రాంతంలో ఎవరిని కదిలించినా అభిమానం ఉప్పొంగింది.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు
తెలంగాణభవన్లో తెలంగాణతల్లి విగ్రహానికి పుష్పాభిషేకం చేస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. చిత్రంలో మాజీ మంత్రి తలసాని, ఎంపీ సంతోష్
పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం బుధవారం తెలంగాణభవన్ నుంచి బస్సుయాత్రగా బయలుదేరుతూ పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
నల్లగొండ శివారు ఆర్జాలబావి వద్ద కేసీఆర్కు ధాన్యం కొనుగోలు కష్టాలు చెప్తున్న ఓ రైతు. చిత్రంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
మిర్యాలగూడ రోడ్షోకు పెద్దసంఖ్యలో హాజరైన ప్రజలకు అభివాదం చేస్తున్న కేసీఆర్. చిత్రంలో మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు