ముట్రాజ్పల్లి సమీపంలో 2500 ఇండ్ల నిర్మాణం
మల్లన్నసాగర్ నిర్వాసితులకు అన్ని సౌకర్యాలతో ఇండ్లు
ఉగాది పర్వదినాన గృహ ప్రవేశాలకు ఏర్పాట్లు
రవేగంగా కొనసాగుతున్న పనులు
గజ్వేల్ రూరల్, ఏప్రిల్ 4: మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణంతో ముంపునకు గురై నిర్వాసితులుగా మారిన ఎనిమిది గ్రామాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడింది. వారికి మెరుగైన ప్యాకేజీ ఇవ్వడంతో పాటు గూడు కల్పించడానికి గజ్వేల్ పట్టణ సమీపంలోని ముట్రాజ్పల్లి వద్ద అత్యాధునిక వసతులతో.. దేశంలో ఎక్కడా లేని విధంగా.. అద్భుతంగా కొత్త కాలనీ నిర్మాణం చేపట్టింది. 600 ఎకరాల విస్తీర్ణంలో 2500 ఇండ్లను సకల వసతులతో ప్రభుత్వం నిర్మించింది. ఒక్కో ఇంటికి 250 గజాల స్థలాన్ని కేటాయించింది. కాలనీలో అంతర్గత డ్రైనేజీ, ప్రధాన రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టింది. విద్యుత్ సౌకర్యం, మిషన్ భగీరథ నల్లాల బిగింపు, గ్రామానికి ఒకటి చొప్పున వాటర్ ట్యాంకు నిర్మాణం చేపట్టింది. కలెక్టర్ వెంక్రటామ్రెడ్డి ఆదేశాలతో నాలుగు రోజులుగా రెవెన్యూ అధికారులు 11 బృందాలుగా విడిపోయి పనులను పరుగెత్తిస్తున్నారు. ఉగాది పర్వదినాన గృహప్రవేశాలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఓపెన్ ప్లాట్ల కోసం పక్కనే స్థలాన్ని చదును చేస్తున్నారు. నిర్వాసితులు మురిసేలా.. గేటెడ్ కమ్యూనిటీ తరహాలో.. ఏ ఒక్క సమస్య తలెత్తకుండా.. అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ.. దేశానికే మోడల్గా ఇక్కడ నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది.
మల్లన్నసాగర్ ప్రాజెక్టులో ముంపునకు గురైన తొగుట మండలం వేములఘాట్, పల్లెపహాడ్ గ్రామాలకు చెందిన 151 కుటుంబాలు సంబురంగా కొత్త ఇండ్లలో పూజలు చేసి, పాలు పొంగించారు. ఆదివారం మంచి రోజు కావడంతో సంతోషంతో ఇంటి ఆడపడుచులతో కడపలు కడిగించి ఇంట్లోకి అడుగు పెట్టారు. గజ్వేల్లోని ఆర్అండ్ఆర్ కాలనీలోకి ఒకేరోజు రెండు గ్రామాల ప్రజలు సంతోషంతో అడుగుపెట్టడంతో కొత్త వాతావరణం కనిపించింది. గజ్వేల్ సమీపంలోని ముట్రాజ్పల్లి వద్ద నిర్మించిన కాలనీలో రెండు గ్రామాల ప్రజలు సామూహిక గృహప్రవేశాలు చేశారు. రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు దగ్గరుండి వారిని కొత్త ఇండ్లలోకి స్వాగతం పలికి మిఠాయిలు తినిపించారు.
గజ్వేల్ పట్టణ సమీపంలోని ముట్రాజ్పల్లి వద్ద నిర్మించిన ఆర్అండ్ఆర్ కాలనీలో వేములఘాట్ గ్రామానికి చెందిన 116 కుటుంబాలు, పల్లెపహాడ్ గ్రామానికి చెందిన 35 కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇండ్లను అధికారులు కేటాయించగా, ఆదివారం 151 కుటుంబాలు నూతన ఇండ్లలోకి ప్రవేశించారు. ముందుగా ఆడపడుచులచే కడపలు కడిగించి, గుమ్మాలకు తోరణాలు, పూల దండలు వేసి గుమ్మడి కాయలు, టెంకాయలు కొట్టి, కొత్త ఇంట్లోకి అడుగు పెట్టారు. బంధువులు, సహ కుటుంబ సభ్యులతో కలిసి పాలు పొంగించి, దేవుడి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆయా గ్రామాల ప్రజలతో కాలనీలో సందడి వాతావరణం కనిపించింది. నాలుగు రోజులుగా ఆర్అండ్ఆర్ కాలనీలో ముంపు గ్రామస్తులకు కేటాయించిన ఇండ్లను అధికారులు శుభ్రం చేయించారు. మౌలిక సదుపాయాలు కల్పించడంతో ఒక్క సారిగా ముంపు గ్రామాల ప్రజలు కొత్త ఇండ్లలోకి చేరుకున్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతుండడంతో త్వరితగతిన ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేయించి గ్రామస్తులకు అధికారులు అందజేశారు. నూతన ఇండ్ల గృహ ప్రవేశాల్లో జిల్లా పంచాయతీ అధికారి సురేశ్బాబు, ఆర్డీవో అనంతరెడ్డి, తహసీల్దార్ ఆరీఫా, బాల్రెడ్డి పాలుపంచుకున్నారు. అధికారులు నేరుగా వెళ్లి ఇంటి యజమానులతో మాట్లాడి మిఠాయిలు తినిపించారు.
ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉంటాం: ఆర్డీవో
మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం ఉన్న ఊరును, పంట పొలాలను త్యాగం చేస్తున్న ముంపు గ్రామస్తులు ఇండ్లను ఖాళీ చేసి గజ్వేల్ పట్టణంలోని ముట్రాజ్పల్లి, సంగాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూం ఇండ్ల్లలోకి వెళ్తున్నారు. ఇప్పటికే రాంపూర్, లక్ష్మాపూర్ గ్రామస్తులు పూర్తిస్థాయిలో గ్రామాలను ఖాళీచేసి సంగాపూర్లోని డబుల్ బెడ్ రూం కాలనీలో, వాగ్గడ్డ వద్ద స్థిరపడ్డారు. మండలంలోని ఏటిగడ్డ కిష్టాపూర్లో 25 మంది, వేములఘాట్లో 116, పల్లెపహాడ్లో 100 మంది ఇండ్లను ఖాళీ చేసి ముట్రాజ్పల్లిలోని డబుల్ బెడ్రూం ఇండ్లలోకి వెళ్లారు. సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డి, తహసీల్దార్ బాల్రెడ్డి, సర్పంచ్లు దామరంచ ప్రతాప్రెడ్డి, సిద్దిపేట బాలయ్య, గుగ్లోతు చిన్న రజిత ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన ముంపు గ్రామస్తులకు ఆర్అండ్ఆర్ కాలనీలో వసతులు ఏర్పాటు చేశారు. ముంపు గ్రామస్తులు ఎంతో సహకారం అందిస్తున్నారని, మిగతా వారు కూడా ఇండ్లు ఖాళీ చేసి గజ్వేల్కు రావడానికి సిద్ధ్దంగా ఉన్నారని ఆర్డీవో అనంతరెడ్డి తెలిపారు. ముంపు గ్రామస్తులకు న్యాయ బద్ధంగా రావాల్సిన పరిహారం అందిస్తున్నామని, ఎవరికైనా అందకపోతే న్యా యం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మూడు గ్రామాల్లో ఇంకా వెయ్యి వరకు కుటుంబాలు ఖాళీ చేయాల్సి ఉందన్నారు.
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
తొగుట, ఏప్రిల్ 4: పూర్వ విద్యార్థులు ఒక్కచోటికి చేరుకున్నారు. 36 ఏండ్ల క్రితం 7వ తరగతి చదువుకున్న నాటి విద్యార్థులందరూ ఒక్క చోటకు చేరి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. మండలంలోని ఏటిగడ్డ కిష్టాపూర్కు చెందిన 1986 బ్యాచ్కు చెందిన 7వ తరగతి విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. మల్లన్న సాగర్లో ఏటిగడ్డ కిష్టాపూర్ ముంపునకు గురికావడంతో చివరి సారిగా పాఠశాలలో కార్యక్రమం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారంతా భావోద్వేగానికి గురయ్యారు. పాఠశాలతో, ఊరుతో ఉన్న అనుబంధాన్ని వల్లె వేసుకున్నారు. ఇక ఈ ప్రాంతం తమకు జ్ఞాపకంగా మిగిలిపోతుందన్నారు. ఈ సందర్భంగా పూర్వ ఉపాధ్యాయులు నరేందర్రెడ్డి, రాజిరెడ్డి, సునందరెడ్డి, బషీరుద్దీన్, హరికిషన్రెడ్డి, శారదను ఘనంగా సన్మానించారు.
ఇవి కూడా చదవండి
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న కామారెడ్డి ట్రస్మా అధ్యక్షుడు
కొండపోచమ్మ సాగర్ అద్భుతంగా ఉంది
ఫాల్కే అవార్డును దోస్త్ రాజ్ బహదూర్కు అంకితం చేస్తున్నా: రజినీకాంత్