MLA Vivek | పెద్దపల్లి, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): ‘చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుటుంబం ముప్పై ఏండ్లుగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్నది. వారిది స్థానికేతరుల కుటుంబం. మీడియా సంస్థలను అడ్డం పెట్టుకొని అవాకులు, చెవాకులు పేలుతున్నది. ఇలాంటి విధానాలను మానుకోలేకపోతే వివేక్ వెంకటస్వామి బట్టలూడదీసి కొడతా’ అంటూ పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గొమాసె శ్రీనివాస్ తీవ్రంగా హెచ్చరించారు.
గురువారం ఆయన పెద్దపల్లిలో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అనంతరం సిర్పూర్కాగజ్నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబుతో కలిసి మాట్లాడుతూ తనపై అవాకులు చెవాకులు పేలితే ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. అనంతరం హరీశ్బాబు మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి ఆగస్టు 15 వరకు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానంటూ.. ఎక్కడికెళ్తే అక్కడి దేవుళ్లపై ఒట్టేస్తున్నారని, అలా కాకుండా తన కూతురుపై ఒట్టుపెట్టి చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ ఓటుకు నోటు కేసులో జూలైలో జైలుకు వెళ్లే అవకాశం ఉందని, అందుకే అభద్రతా భావంతో ఆగస్టు 15 వరకు డెడ్లైన్ విధిస్తున్నారని విమర్శించారు. బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్రెడ్డి, నాయకుడు ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు.